
జూన్ లో భారతీయ బాండ్లలో పెరిగిన పెట్టుబడులు
ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చినట్లే గణాంకాలు విడుదల
భారతీయ బాండ్లలో పెట్టుబడి పెడితే వడ్డీ, మూలధన లాభాలపై పన్ను మినహయింపు ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లుఈ నెలలో రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టారని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) డేటా వెల్లడించింది. ఈ పెట్టుబడులన్నీ భారత ప్రభుత్వ సెక్యూరిటీల 'ఫుల్లీ యాక్సెసబుల్ రూట్' (FAR) కిందకు వచ్చాయి. FAR విధానం ప్రవాస ఇన్వెస్టర్లను ఎలాంటి పెట్టుబడి పరిమితులు లేకుండా, భారత ప్రభుత్వానికి చెందిన నిర్దిష్ట సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.
FAR సెక్యూరిటీలలో ఎఫ్పీఐ హోల్డింగ్స్ మంగళవారం నాటికి రూ. 3.58 లక్షల కోట్లకు చేరాయని, ఇది జూన్ 3 నాటి రూ. 3.23 లక్షల కోట్ల కన్నా ఎక్కువని డేటా వెల్లడించింది. దీనికి ముందు, విదేశీ ఇన్వెస్టర్లు మే నెలలో రూ. 5,512.108 కోట్లు, ఏప్రిల్లో రూ. 5,262.016 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే, మార్చిలో రూ. 17,687.988 కోట్ల నిధులు బయటకు వెళ్లిపోయాయి. దీనితో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటుచర్యలకు దిగింది.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) కలిగి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం, మార్పిడి లేదా బదిలీ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై పన్ను మినహాయింపును అందించడానికి, ప్రభుత్వం జూన్ 5న ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది.
ఈ మినహాయింపు ఏప్రిల్ 1, 2025 నుంచి వర్తించేలా నిబంధనలు సడలించారు. దేశీయ రుణ మార్కెట్లోకి మరింత విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి, బయటి పరిస్థితుల నుంచి రూపాయికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తున్న తరుణంలో ఈ చర్య తీసుకుంది. ప్రస్తుతం, 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు కలిగి ఉన్న లిస్టెడ్ షేర్లు, బాండ్లపై విదేశీ పెట్టుబడిదారులు 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీపై 20 శాతం విత్హోల్డింగ్ పన్ను విధించబడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తన జూన్ ద్రవ్య విధాన ప్రకటనలో, 15-సంవత్సరాలు, 30-సంవత్సరాలు, 40-సంవత్సరాల కాలపరిమితి గల అన్ని కొత్త ప్రభుత్వ సెక్యూరిటీల జారీలను చేర్చడం ద్వారా FAR కింద అందుబాటులో ఉన్న సెక్యూరిటీల పరిధిని కూడా విస్తరించింది. జనరల్ రూట్ కింద FPI పెట్టుబడుల కోసం స్వల్పకాలిక పెట్టుబడి, కాన్సంట్రేషన్, వ్యక్తిగత సెక్యూరిటీలకు సంబంధించిన పరిమితులను కూడా కేంద్ర బ్యాంక్ తొలగించింది.
"ఈ చర్యలు, ఈ ఉదయం ప్రభుత్వం అందించిన పన్ను ప్రయోజనాలతో పాటు, ప్రభుత్వ రుణాల కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడతాయి" అని ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా ఆర్బిఐ తెలిపింది. బాండ్ మార్కెట్ను మరింత బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి భారత్ ప్రయత్నిస్తున్నందున, ఈ చర్యల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ విదేశీ పెట్టుబడిదారులకు మరింతగా తెరిచారు.
Next Story

