
డొనాల్డ్ ట్రంప్
‘‘భారత్ లాంటి ఎన్నికలు అమెరికాలో జరగాలి’’
సేవ్ అమెరికా చట్టానికి మద్దతుగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ప్రశంసించారు. అమెరికాలోనూ ఇలాంటి కఠిన, పారదర్శకత చట్టాలు అవసరమని పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలలో ఓటరు గుర్తింపు కార్డు లేకపోవడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
సోమవారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్లో ట్రంప్ ‘‘భారత్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 64.6 కోట్ల మందికి పైగా పాల్గొన్నప్పటికీ, ఒక శాతం కన్నా తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేశారు. ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తమ ప్రభుత్వంలోని అధికారులతో మాట్లాడి, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు లేకుండా అమెరికా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారని ట్రంప్ తెలిపారు.
'సేవ్ అమెరికా యాక్ట్'కు మద్దతు కూడగట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం ప్రకారం, ఓటు నమోదు చేసుకోవడానికి అమెరికన్లు తమ పౌరసత్వ రుజువును చూపించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అవుతుంది.
మెయిల్ ద్వారా ఓటింగ్పై తీవ్ర పరిమితులు ఉన్నాయి. "ఈ నెల ప్రారంభంలో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?" అని ట్రంప్ రాశారు.
"భారతదేశపు గత ఎన్నికలలో 646,000,000 మంది ఓటర్లు పాల్గొన్నారు! వారిలో ఒక శాతం కన్నా తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారు. ప్రతి ఒక్క ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం తప్పనిసరిగా ఉండాలి."
"మనం ఇప్పుడు 'సేవ్ అమెరికా యాక్ట్'ను ఆమోదించాలి" అని ఆయన నొక్కి చెప్పారు. ఈ చర్య ఎన్నికల మోసాన్ని అరికడుతుందని పేర్కొంటూ, 'సేవ్ అమెరికా యాక్ట్'ను ఆమోదించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. అయితే, ఈ విషయంపై డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ విభేదిస్తున్నారు. ఈ చట్టం ఆమోదం కోసం ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకుండానే ఈ నెల ప్రారంభంలో యూఎస్ సెనేట్ ఐదు వారాల విరామం కోసం వాయిదా పడింది.
వైట్ హౌస్ వెబ్సైట్లోని 'సేవ్ అమెరికా యాక్ట్'పై ఒక ఫ్యాక్ట్-షీట్ ప్రకారం, భారత్, బ్రెజిల్ ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డులను బయోమెట్రిక్ డేటాబేస్కు అనుసంధానించగా, యూఎస్ మాత్రం ఓటర్ల స్వీయ-ధృవీకరణపై ఆధారపడి ఉందని కూడా పేర్కొంది. ఈ బిల్లు పురుషులు మహిళల క్రీడలలో పోటీపడకుండా శాశ్వతంగా నిషేధించాలని, పిల్లలకు ట్రాన్స్జెండర్ మ్యూటిలైజేషన్ శస్త్రచికిత్సను నిషేధించాలని కూడా కోరుతోంది.
Next Story

