ఇరాన్ దాడులను ఖండించిన భారత్
x
మంటల్లో చిక్కుకున్న యూఏఈ ఆయిల్ కేంద్రాలు

ఇరాన్ దాడులను ఖండించిన భారత్

యూఏఈ పోర్ట్ సిటీ పుజైరా పై టెహ్రన్ దాడులు, ముగ్గురు భారతీయులకు గాయాలు


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో ఇరాన్ చర్యలను భారత్ తొలిసారిగా ఖండించింది. యూఏఈలోని పోర్ట్ సిటీ పుజైరాలో ఉన్న పెట్రోలియం కేంద్రంపై ఇరాన్ దాడి చేయడంతో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. దీనిపై భారత్ స్పందించింది.

అమాయకపు పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే, టెహ్రాన్ యూఏఈపై క్షిపణులు, డ్రోన్‌లతో మరోసారి దాడుల వర్షం కురిపించింది.

ఇందులో ప్రధానంగా పుజైరాలోని ఆయిల్ కేంద్రాలే లక్ష్యంగా ఉన్నాయి. ఇరాన్ దాడుల వల్ల అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆ కేంద్రంలో ఉన్న పలువురు భారత పౌరులు గాయపడ్డారు. డ్రోన్ దాడిలో భారతీయులు గాయపడిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ స్పందించింది.

ఇవి సరైన లక్ష్యాలు కావు..

"ఫుజైరాపై జరిగిన దాడిలో ముగ్గురు భారత పౌరులు గాయపడటం ఆమోదయోగ్యం కాదు. ఈ ఘర్షణలను, పౌర మౌలిక సదుపాయాలను, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాము. పశ్చిమ ఆసియా అంతటా శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడేలా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చర్చలు, దౌత్యం కోసమే భారత్ నిలబడుతుంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
"అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యం జరగాలని కూడా మేము పిలుపునిస్తున్నాము. సమస్యల శాంతియుత పరిష్కారం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది" అని ఆయన అన్నారు.

ప్రశాంతతకు భగ్నం..

వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో నెలకొన్న స్వల్పకాలిక ప్రశాంతతకు ఈ దాడి హింసాత్మక ముగింపు పలికింది. వైమానిక రక్షణ వ్యవస్థలు 12 బాలిస్టిక్ క్షిపణులను, అనేక డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకున్నాయని ఎమిరేట్స్ అధికారులు ప్రకటించారు. అయితే వాటి శకలాలు, నేలపై పడటంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులు నెల రోజుల ప్రశాంత వాతావరణాన్ని చిద్రం చేశాయి.
ఫుజైరాపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడులలో ముగ్గురు భారత జాతీయులు గాయపడిన నేపథ్యంలో, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఎమిరేట్స్ అధికారులతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. "బాధిత భారతీయ పౌరులకు తగిన వైద్య సంరక్షణ, సంక్షేమం అందించేందుకు మేము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము" అని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫుజైరా వ్యూహాత్మక స్థానం

యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇరాన్ తన తాజా దాడిలో నాలుగు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో మూడింటిని అడ్డుకోగా, నాలుగోది సముద్రంలో పడిపోయింది. మరోవైపు, దేశ ఇంధన ఎగుమతులకు కీలక కేంద్రమైన ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయి. అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిని స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించారు.
ఒమన్‌ గల్ప్ లో ఫుజైరా వ్యూహాత్మక స్థానంలో ఉంది. చమురు రవాణా కోసం యూఏఈకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను బైపాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. వారాల తరబడి జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత నెలకొన్న పెళుసైన ప్రశాంతతకు ఈ దాడి భంగం కలిగించింది. ఈ ఘర్షణల సమయంలో ఎమిరేటీ దళాలు వేలాది డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకున్నట్లు నివేదించాయి. సోమవారం, దుబాయ్, అబుదాబిలోని సాధారణ పౌరులకు క్షిపణి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

ద్రోహపూరిత చర్య: యూఏఈ

ఇరాన్ నావికా దళాలు తమ కార్యాచరణ పరిధిని గణనీయంగా విస్తరించి, ఫుజైరా, ఖోర్ఫక్కన్‌తో సహా కీలకమైన యూఏఈ ఓడరేవులకు మరింత చేరువయ్యాయని టెహ్రాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను "ద్రోహపూరిత చర్య"గా, తీవ్రమైన ఉద్రిక్తతగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించింది.


Read More
Next Story