
ఖ్వాజా ఆసిఫ్
ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్
అబ్రహమిక్ ఒప్పందాలలో చేరబోమన్న పాకిస్తాన్ రక్షణమంత్రి
ఇజ్రాయెల్ తో సంబంధాలను నెరిపేందుకు ఉద్దేశించిన అబ్రహమిక్ ఒప్పందాలలో తాము చేరేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టత ఇచ్చారు. ఇరాన్తో శాంతి చర్చలలో పాల్గొంటున్న దేశాలు, ఇజ్రాయెల్ -అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"వ్యక్తిగతంగా, మన మౌలిక భావజాలాలతో విభేదించే అటువంటి ఒప్పందంలో మనం చేరకూడదని నేను భావిస్తున్నాను," అని ఆసిఫ్ సోమవారం రాత్రి (మే 25) సమా టీవీలో ఒక టాక్ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
చర్చలు జరుపుతున్న దేశాలలో, యూఏఈ, బహ్రెయిన్ ఇప్పటికే ఈ ఒప్పందాలలో సభ్యులుగా ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్ కూడా అబ్రహమిక్ ఒప్పందంపై సంతకం చేస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు.
పాకిస్తాన్ వైఖరి..
1967 కి ముందు తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనా దేశం ఏర్పడే వరకూ ఇజ్రాయెల్ ను అంగీకరించకూడదనే తమ దేశ వైఖరికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. "ఇది మాకు ఆమోదయోగ్యం కాదనే స్పష్టమైన వైఖరి మాకు ఉంది" అని ఆయన అన్నారు.
1947-48లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి పాకిస్తాన్ దానిని ఎన్నడూ అధికారికంగా గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో జరిగిన పాలస్తీనా విభజనను వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించడమే ఈ వైఖరికి మూలం. విశ్వసనీయత అంశాన్ని కూడా మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "ఒక్క రోజు కూడా మాట నమ్మలేని వారితో మీరు ఎలా కూర్చుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తాన్ పాస్పోర్ట్లో ఇజ్రాయెల్ పేరు కూడా ఉండదని, ఇజ్రాయెల్కు ప్రయాణించడానికి అది చెల్లదని స్పష్టంగా పేర్కొంటుందని కూడా ఆయన ప్రస్తావించారు. యూదు దేశంతో సంబంధాలను సాధారణీకరించే ఏ ఆలోచననైనా తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ నాయకులలో ఆసిఫ్ ఒకరు.
గత నెలలో, ఆ ప్రాంతంలో జాతి నిర్మూలనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఆయన ఇజ్రాయెల్ను "మానవాళికి శాపం" అని అభివర్ణించారు. అంతకుముందు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అబ్రహం ఒప్పందాలలో చేరడాన్ని ఖచ్చితంగా తోసిపుచ్చారు.
"పాలస్తీనా వివాదానికి ద్విరాజ్య పరిష్కారాన్ని అంగీకరించే వరకు ఇజ్రాయెల్ను గుర్తించడానికి మేము సిద్ధంగా లేము" అని దార్ అన్నారు, పాకిస్తాన్ ఏడు దశాబ్దాల నాటి విధానం మారలేదని కూడా ఆయన తెలిపారు.
అబ్రహం ఒప్పందాలు..
ట్రంప్ అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలో అంటే 2020లో అబ్రహమిక్ అకాడ్ ను ప్రతిపాదించారు. దీనిప్రకారం.. ఇజ్రాయెల్ -అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను సాధారణీకరించడమే వీటి లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మొదట సంతకాలు చేయగా, ఆ తర్వాత మొరాకో, సూడాన్ చేరాయి. సోమవారం (మే 25) ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో, ఈ ఒప్పందాలలో దేశాలు చేరడం "తప్పనిసరి"గా ఉండాలని ట్రంప్ అన్నారు.
విస్తృత భాగస్వామ్యం "5,000 సంవత్సరాలలో మొదటిసారిగా పశ్చిమాసియాకు నిజమైన శక్తి, బలం శాంతిని" తీసుకురాగలదని ఆయన వాదించారు. కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను పరిష్కరించే ప్రయత్నాల మధ్య సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఒకటి లేదా రెండు దేశాలు అలా చేయకపోవడానికి ఒక కారణం చెప్పవచ్చు, దానిని అంగీకరిస్తాము, కానీ చాలా దేశాలు ఇరాన్తో ఈ ఒప్పందాన్ని, లేకపోతే జరిగే దానికంటే చాలా ఎక్కువ చారిత్రాత్మక సంఘటనగా మార్చడానికి సిద్ధంగా, సుముఖంగా సమర్థవంతంగా ఉండాలి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
గాజా శాంతి పాత్రపై స్పష్టత
ఈ ఏడాది జనవరిలో, గాజా కాల్పుల విరమణ కోసం ట్రంప్ "బోర్డ్ ఆఫ్ పీస్" ప్రతిపాదించారు. అయితే దీనిలో అబ్రహం ఒప్పందాలతో ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ కూడా స్పష్టం చేసింది. విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అండ్రాబి ప్రకారం.. పాకిస్తాన్ "అబ్రహం ఒప్పందంలో పక్షంగా మారదు" అని తెలిపారు.
Next Story

