
ఆందోళన చేస్తున్న నిరసనకారులు
నేపాల్ లో జెన్ జీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్
ఆక్రమణలు తొలగించడాన్ని నిరసిస్తూ స్థానికుల నిరసనలు, జతకలిసిన జెన్ జీ కార్యకర్తలు
నేపాల్ లో మరోసారి ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ వందలాది మంది ఆందోళనకారులు ఖాట్మాండ్ లో భారీ ప్రదర్శన చేశారు. ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చేయకుండా భూమిలేని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ ప్రదర్శన జరిగింది. జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కాఠ్మండులోని సింగ్దర్బార్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మైతిఘర్ మండలం వద్ద ఈ నిరసన జరిగింది.
నిరసనలో 'పేదలపై అఘాయిత్యాన్ని అంతం చేయండి', 'మానవ హక్కులను గౌరవించండి', 'అక్రమ అరెస్టులను ఆపండి', 'ఆక్రమణదారులకు ఆశ్రయం కల్పించండి' అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. ఇదిలా ఉండగా, ఖాట్మాండ్ లోని కీర్తిపూర్లో సుమారు 150 మంది ఆక్రమణదారులు నివసిస్తున్న ప్రభుత్వ నిర్బంధ కేంద్రం శుక్రవారం రాత్రి వరదలకు గురైంది.
దీంతో భద్రతా సిబ్బంది సహాయంతో అక్కడి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. యువత నేతృత్వంలోని జెన్ జెడ్ కార్యకర్తలు పరిస్థితిని సమీక్షించడానికి శనివారం అక్కడికి చేరుకున్నారు. అయితే, వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేశారు. ఒక కార్యకర్త ముఖానికి గాయాలవడంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. కార్యకర్తలను అరెస్టు చేసినందుకు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
పోలీసుల చర్యను నిరసిస్తూ, అరెస్టు అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, జెన్ జెడ్ కార్యకర్తల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా కోసి ప్రావిన్స్లోని మోరంగ్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆదివారం ధర్నా చేసిన 26 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఏప్రిల్లో, ప్రభుత్వం కాఠ్మండు లోయలోని వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భూమిలేని నివాసితుల నిర్మాణాలను కూల్చివేసి వారిని ఖాళీ చేయించింది.
దీనివల్ల 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. వీరిలో 325 కుటుంబాలు ఖాట్మండ్ లోని వివిధ ప్రాంతాల్లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాలలో ఉంటున్నాయి. జూలై 2న, భూమిలేని ఆక్రమణదారులు జూలై 6లోగా నిర్బంధ కేంద్రాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ, గురువారం నాటికి కూడా 60కి పైగా కుటుంబాలు అక్కడే ఉండిపోయాయి.
Next Story

