
తిరుమలలో భక్తులకు 16 కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు
తిరుమలలో భక్తుల కోసం 16 వైద్య కేంద్రాలు, 9 అంబులెన్సులతో 24 గంటల వైద్య సేవలు టీటీడీ అందుబాటులో ఉంచింది.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తులకు వైద్య సహాయం అవసరమైనప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా విరివిగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది.
16 వైద్య కేంద్రాల ద్వారా భక్తులకు వైద్య సేవలు
తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్వనీ ఆసుపత్రి ప్రధాన వైద్యశాల కాగా, దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట-6 ఎదురుగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన, కల్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, పీఏసీ-5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో 24X7 భక్తులకు వైద్య సేవలు అందించబడతాయి.
అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, పీఏసీ-2, అలిపిరి పాదాల మండపం, ఏడో మైలు, భాష్యకార్ల సన్నిధి, రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో శిలాతోరణం, సేవా సదన్ వద్ద వైద్య కేంద్రాల్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి. శ్రీవారి మెట్టులోని 1200 మెట్టు వద్ద ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి.
బ్రహ్మోత్సవాల సమయంలో రామ్ భగీచా-1, పాపవినాశనం వద్ద రెండు అదనపు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే కాకుండా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా భక్తులకు వైద్య సేవలు అందించడం జరుగుతోంది.
అందుబాటులో 9 అంబులెన్సులు
భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో మొత్తం 9 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3 అంబులెన్సులు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుండగా, ఐదు 108 అంబులెన్సులు, ఒక అపోలో అంబులెన్సు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్వనీ ఆసుపత్రి వద్ద 2 అంబులెన్సులు, ఒక అపోలో అంబులెన్సులు అందుబాటులో ఉండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వైద్య కేంద్రం ఒక అంబులెన్సు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న రామ్ భగీచా విశ్రాంతి గృహం వద్ద ఒక అంబులెన్సు, ఏటీసీ వద్ద ఒక అంబులెన్సు, అలిపిరి తనిఖీ కేంద్రం, రెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డు, మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలపు వద్ద ఒక్కో అంబులెన్సు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన వైద్య సహాయం అవసరమైన భక్తులను ముందుగా అశ్వనీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తారు. మెరుగైన వైద్యం అవరమైన వారిని ఉచితంగా తిరుపతిలోని రూయా, బర్డ్, స్విమ్స్, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రులకు తరలించడం జరుగుతోంది. వీటికి అదనంగా బ్రహ్మోత్సవాలు, రథ సప్తమి వేడుకల సమయంలో వాహన సేవల వెనుక ఒక అంబులెన్సు, నారాయణగిరి షెడ్ల వద్ద ఒక అంబులెన్సును అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
128 మంది సిబ్బందితో నిరంతరాయంగా వైద్య సేవలు
తిరుమలలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 8 మంది డాక్టర్లు, 120 మంది పారా మెడికల్ సిబ్బందితో నిరంతరాయంగా వైద్య సేవలు అందించడం జరుగుతోంది. తిరుమలలోని అన్ని వైద్య కేంద్రాల్లో రోజుకు సగుటున 2400 మంది భక్తులు వైద్య సేవలు పొందుతున్నారు.
అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో
తిరుమలకు వచ్చిన భక్తులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అశ్వనీ ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్-రే, ల్యాబ్, నెబ్యూలేషన్, ఆక్సీజన్, డ్రెస్సింగ్ వంటి వివిధ వైద్య సదుపాయాలతో పాటు మెరుగైన వైద్యం అవసరమైన వారిని తిరుపతిలోని రూయా, బర్డ్, స్విమ్స్, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది.

