సీఎం రేవంత్ రెడ్డి మా కెప్టెన్: అజహరుద్దీన్
x
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహ్మద్ అజహరుద్దీన్ (ఫొటో : తెలంగాణ ఐ అండ్ పీఆర్ సౌజన్యంతో)

సీఎం రేవంత్ రెడ్డి మా కెప్టెన్: అజహరుద్దీన్

మైనారిటీల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ ప్రమాణం


తెలంగాణ శాసనమండలిలో సోమవారం కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించాయి. మాజీ క్రికెటర్, ప్రస్తుతం మంత్రి అయిన మహ్మద్ అజహరుద్దీన్ ( Mohammad Azharuddin) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డినే తమ జట్టు కెప్టెన్ అని స్పష్టం చేశారు. మరోవైపు ప్రొఫెసర్ ఎం కోదండరాం (M. Kodandaram)తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని చెబుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వెల్లడించారు.

నేను కెప్టెన్ కాదు: అజహరుద్దీన్

తమ జట్టు కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ చెప్పారు. సోమవారం ఉదయం శాసనమండలి కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తాను కెప్టెన్ ను కాదని స్పష్టం చేశారు. ‘‘నాకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ అని మంత్రి చెప్పారు. భవిష్యత్ లో పొలిటికల్ ఫ్యాన్స్ ను కూడా పెంచుకుంటానని చెప్పారు.

మైనారిటీల సంక్షేమానికి కృషి

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రాధాన్యమిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు ఎమ్మెల్సీతోపాటు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గానికి, టీపీసీసీకి, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధన్యావాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. మంత్రిగా తాను ప్రజల కోసం పనిచేస్తానన్నారు.

మంత్రి పదవిపై ఆశ లేదు : కోదండరాం

తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. తనపై గతంలో తప్పుడు కేసులు బనాయించారని ఆయన తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కోదండరాం చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటానని చెప్పారు.

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం
శాసన మండలి కార్యాలయంలో సోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా గవర్నర్ నియమించిన మహ్మద్ అజారుద్దీన్ ,కోదండరాం లతో ఎంఎల్సీ లు గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ లు,ఎంఎల్సీ లు,ఎంఎల్ ఏ లు పాల్గొన్నారు.
Read More
Next Story