రూ.198 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ
x

రూ.198 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన. ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం, మేడిగడ్డ బ్యారేజ్ స్థితిగతుల పరిశీలన.


జయంశకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.198 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని అధికారులను సూచించారు. ఈ సందర్భంగానే కాళేశ్వరం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలపై దృష్టి సారించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ పర్యటనలో ఆలయ అభివృద్ధి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితుల వరకు సమగ్రంగా పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు భూమిపూజ చేసినట్టు అధికారులు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. తర్వాత సీఎం నేరుగా మేడిగడ్డ బ్యారేజ్‌కు వెళ్లారు. గత కొంతకాలంగా వివాదంగా మారిన కుంగుబాటు సమస్య, ప్రస్తుత పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్టు తెలిసింది. బ్యారేజ్ మరమ్మత్తులు ఎంతవరకు జరిగాయో, వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి పరిస్థితులను అంచనా వేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

తదుపరి పర్యటనలో భాగంగా కాటారం మండలం నస్తూరిపల్లికి వెళ్లనున్న సీఎం, అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే వేదికపై రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్టు వెల్లడైంది. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో సీఎం స్వయంగా మేడిగడ్డను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తోడుగా ఉన్నారు.

Read More
Next Story