
కావేరీ జలాలపై సీడబ్ల్యూఆర్సీ ఆదేశం.. కర్ణాటకలో ఆందోళనలు ఉధృతి
తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలన్న సీడబ్ల్యూఆర్సీ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో విస్తృత నిరసనలు చెలరేగాయి.
తమిళనాడుకు 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరు, మైసూరు, మాండ్య, రామనగర ప్రాంతాల్లో కన్నడ అనుకూల సంఘాలు పెద్దఎత్తున నిరసనలకు దిగాయి.
"మా రాష్ట్రానికే నీళ్లు లేవు"
కర్ణాటక ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోందని నిరసనకారులు చెప్పారు. తాగునీటితో పాటు వ్యవసాయం, పశువులకు కూడా సరిపడా నీళ్లు లేవని, అలాంటి పరిస్థితిలో తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. "ఒక్క చుక్క నీటిని కూడా వదలకూడదు" అంటూ నినాదాలు చేశారు.
బెంగళూరులో భారీ నిరసన
బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక (KRV)తో పాటు పలు కన్నడ సంఘాల కార్యకర్తలు మల్లేశ్వరంలోని కువెంపు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. నీటి కొరతకు గుర్తుగా తలపై ఖాళీ కుండలు మోసుకుని నిరసన తెలిపారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
"4.5 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి?"
కన్నడ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే దాదాపు 4.5 టీఎంసీల నీరు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం డ్యామ్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితిలో అంత నీటిని విడుదల చేయడం అసాధ్యమని అన్నారు.
ఉద్యమం మరింత ఉధృతమవుతుందా?
రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను అమలు చేస్తే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ముందుగా కర్ణాటకలో తాగునీటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
బీజేపీ విమర్శలు..
కావేరీ అంశాన్ని సమర్థంగా నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. సీడబ్ల్యూఆర్సీ ముందు రాష్ట్ర తరఫున వాదించిన అధికారులు, న్యాయవాదులు కర్ణాటకలోని నీటి కొరతను సరైన విధంగా వివరించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు.
వివాదం మళ్లీ వేడెక్కింది..
కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు–కర్ణాటక మధ్య ఇప్పటికే దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. తాజా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలతో ఈ అంశం మరోసారి రెండు రాష్ట్రాల్లో రాజకీయ, రైతు సంఘాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం కర్ణాటకలో నిరసనలు కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది.

