
చిదంబరం
నేను దిమాగీ నక్సల్ నే: చిదంబరం
అందుకు గర్వపడుతున్నాని ట్వీట్.. నిన్న వామపక్ష తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నవారిని దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ ఆగ్రహం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘దిమాగీ నక్సల్స్’ అంటూ వామపక్ష తీవ్రవాదానికి మద్దతుగా ఉన్న వ్యక్తులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చిదంబరం స్పందించారు. తాను ‘దిమాగీ నక్సల్’ అయినందుకు గర్వపడుతున్నాని పేర్కొన్నారు.
వ్యవస్థలో పాతుకుపోయి, విధానాలను తారుమారు చేస్తూ సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న 'దిమాగీ నక్సల్స్' గురించి మోదీ దేశాన్ని హెచ్చరించిన ఒక రోజు తర్వాత, ప్రధానిపై చిదంబరం ఈ విమర్శలు చేశారు. వారిని "గుర్తించి, ఏకాకిని చేయాలని" మోదీ పౌరులను కోరారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి మాట్లాడుతూ, అడవుల నుంచి సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించడంలో దేశం విజయం సాధించిందని, అయితే దాని భావజాల మద్దతుదారులు హింస, అరాచకాలను ప్రోత్సహించడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని ప్రధానమంత్రి హెచ్చరించారు.
ప్రధానిపై ఎదురుదాడి చేస్తూ చిదంబరం "నేను ఒక దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నాను!" అని అన్నారు. తన ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, "సంవత్సరాలుగా, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు అధికార పీఠాలలో పాతుకుపోయారు.
వారు ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా పనిచేస్తూ ప్రజా విధానాలను ప్రభావితం చేశారు" అని అన్నారు. ఈ సవాలును మనం తక్కువ అంచనా వేయకూడదని, మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
దశాబ్దాల నక్సలిజం, మావోయిస్టు హింస లక్షలాది మంది యువత జీవితాలను, ఆశలను నాశనం చేశాయని, ఈ ఘర్షణల్లో 3,500 మందికి పైగా పోలీసు, భద్రతా సిబ్బంది మరణించారని, ఈ సంఖ్య యుద్ధాల్లో చనిపోయే సైనికుల సంఖ్య కంటే చాలా ఎక్కువని ఆయన అన్నారు.
"నక్సలిజం భారతదేశంలోని చాలా పెద్ద భాగాన్ని, భారీ జనాభాను తుపాకీ గురితో తన గుప్పిట్లో ఉంచుకుంది" అని ఆయన అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తన ప్రభుత్వం నక్సలిజం నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. "దశాబ్దాల నాటి సవాళ్లకు ముగింపు పలకాలి. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేశాయి.
అవి లెక్కలేనంత మంది తల్లుల కుమారులను దూరం చేశాయి. కుటుంబాలను నాశనం చేశాయి, తల్లిదండ్రుల కలలను ఛిన్నాభిన్నం చేశాయి" అని ఆయన అన్నారు. "నక్సలైట్, మావోయిస్టు హింసకు నేడు ముగింపు పలుకుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు నక్సలైట్ల తూటాలు మోగి, రక్తపాతం సర్వసాధారణమైన ప్రాంతాలలో, ఇప్పుడు అభివృద్ధి, విశ్వాసం, కృషికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయి," అని ఆయన అన్నారు.
Next Story

