
కృష్ణ స్వామినాథన్
నేవీ కొత్త చీఫ్ గా కృష్ణ స్వామినాథన్
మే 31 న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్
వైస్ అడ్మిరల్ ‘కృష్ణ స్వామినాథన్’ తదుపరి నావికాదళ అధిపతిగా నియమితులయ్యారు. మే 31న పదవీ విరమణ చేయనున్న నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం పశ్చిమ నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేస్తున్నారు. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
1987 జూలై 1న భారత నావికాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్ గా కృష్ణ స్వామి నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధంలో నిపుణుడు. ఆయన ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, యునైటెడ్ కింగ్డమ్లోని ష్రివెన్హామ్లో ఉన్న జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరంజాలోని కాలేజ్ ఆఫ్ నావల్ వార్ఫేర్, న్యూపోర్ట్లోని యూఎస్ నావల్ వార్ కాలేజీ పూర్వ విద్యార్థి. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం వంటివి పొందారు.
తన నావికాదళ వృత్తిలో అనేక కీలక కార్యాచరణ, సిబ్బంది, శిక్షణా పదవులను నిర్వహించారు. ఆయన ఐఎన్ఎస్ విద్యుత్, వినాష్ క్షిపణి నౌకలకు, ఐఎన్ఎస్ కులిష్ క్షిపణి కార్వెట్కు, ఐఎన్ఎస్ మైసూర్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకకు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌకకు కమాండర్గా వ్యవహరించారు.
Next Story

