
అక్రమ క్రషర్ ను కూల్చివేస్తున్న హైడ్రా అధిాకారులు
హైడ్రా దూకుడు: బడాబాబుల అక్రమ క్రషర్లు,ఆర్ఎంసీ యూనిట్లపై బుల్డోజర్
పేదల ఇళ్లే కాదు… బడాబాబుల క్రషర్లపై కూడా హైడ్రా దెబ్బ
హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్, కాలుష్యానికి కట్టడి వేయాలనే లక్ష్యంతో హైడ్రా మరోసారి దూకుడు చూపించింది. ఈసారి పేదల ఇళ్లపై కాకుండా బడా సంస్థలు నడుపుతున్న స్టోన్ క్రషర్లు, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) యూనిట్లపై జేసీబీలు గర్జించాయి. అనుమతులు లేకుండా నడుస్తున్న 6 క్రషర్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను కూల్చివేయడంతో అక్రమ కార్యకలాపాలపై కఠిన సందేశం వెళ్లింది.
హైడ్రా మంగళవారం మరోసారి హడలెత్తించింది. ఈ సారి భవనాలపై కాకుండా అక్రమంగా నడుపుతున్న స్టోన్ క్రషర్లు, ఆర్ఎంసీ యూనిట్లపై హైడ్రా జేసీబీలు దాడి చేసి కూల్చివేశాయి. హైదరాబాద్ నగర శివార్లలో పలువురు బడా బాబులు అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లు, ఆర్ఎంసీ యూనిట్లపై హైడ్రా తన ప్రతాపం చూపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా కాలుష్యం వెదజల్లుతూ నడుపుతున్న ఆరు క్రషర్లు, 12 ఆర్ఎంసీ యూనిట్లను హైడ్రా కూల్చివేసింది. పేదల ఇళ్లనే కాకుండా బడా బాబుల క్రషర్లపై బుల్డోజరు నడుపుతామని ఈ కూల్చివేతల ద్వారా హైడ్రా నిరూపించింది. నగర శివార్లలో క్రషర్లు, ఆర్ఎంసీ యూనిట్లు నడుపుతున్నారని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ గనుల శాఖ ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వానికి రాయల్టీ కింద వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని గనుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఆరు క్రషర్లపై హైడ్రా దాడులు
హైదరాబాద్ నగర శివార్లలోని అక్రమంగా నడిపిస్తున్న ఆరు క్రషర్లపై హైడ్రా శుక్రవారం కూల్చివేసింది. ఒకే రోజు ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన హైడ్రా.. 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లను కూల్చివేసింది.శేరిలింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్,గండిపేట మండలం వట్టినాగులపల్లి, శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో హైడ్రా అధికారులు జేసీబీలతో దాడులు చేసి ఆరు క్రషింగ్ యూనిట్లు, 12 రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను కూల్చివేశారు.
బడాబాబుల క్రషర్ల కూల్చివేత
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ విలేజ్లో అక్రమ మైనింగ్కు పాల్పడినవారంతా బడా సంస్థలకు చెందిన వారేనని హైడ్రా అధికారులు చెప్పారు.అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను కూల్చివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాను కోరారు. ఎలాంటి అనుముతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని కలెక్టరు పేర్కొన్నారు. గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలోని మూడు చోట్ల పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్/ శ్రీ లక్ష్మి కన్ స్ట్రక్షన్స్, పృథ్వి స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలో రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు అక్రమమైనింగ్ చేస్తున్నాయని వెల్లడైంది.
మంత్రి కుటుంబసభ్యుల క్రషర్ కూల్చివేత
రాఘవ స్టోన్ క్రషర్ మంత్రి పొంగులేటి కుటుబబానికిదని చెబుతున్నారు. ఈ సంస్థలకు తోడు మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ను చేపట్టారు. మైనింగ్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా యూనిట్లు నడపడంతో రంగారెడ్డి కలెక్టర్ లేఖ తో హైడ్రా చర్యలు తీసుకుంది. కాలుష్య కారక యూనిట్లను తొలగింపుతో ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రషర్ల యజమానులు కరెంట్ బిల్లులు రూ. కోట్లలో బకాయిలు ఉండటంతో కరెంట్ కట్ చేస్తే డీజిల్ తో యూనిట్లు నడిపిస్తున్నారని తేలింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
2024వ సంవత్సరం ఆగస్టు 24వతేదీన హైదరాబాద్లోని మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కేంద్రాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించారనే హైడ్రా చర్య చేపట్టింది. మాదాపూర్లోని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కన్వెన్షన్లో, సుమారు 1.12 ఎకరాల ఎఫ్టీఎల్, 2 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమ నిర్మాణాలు, కాలుష్య కారక యూనిట్లపై ఎలాంటి రాజీ ఉండదని హైడ్రా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పేదల ఇళ్లకే పరిమితం కాకుండా ప్రభావశీలుల వ్యాపారాలపైనా చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం అందరికీ సమానమనే సంకేతాన్ని ప్రభుత్వం పంపిస్తోంది.
Next Story

