
"రిపోర్టులతో సరిపెట్టద్దు హెటెరో యూనిట్-1ను వెంటనే మూసివేయాలి"
దోమడుగులో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ భారీ ర్యాలీ - ఎన్నికల బహిష్కరణకు పిలుపు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని వాటి వలన తమకు ఉపయోగం లేదని ప్రజలు స్పష్టం చేశారు.
దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి హెటెరో డ్రగ్స్ ఏ కారణమని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) నివేదికలు ఇవ్వడం తోనే పీసీబీ బాధ్యత తీరిపోదని ఆ కంపెనీ యూనిట్-1 ని మూసివేయాలని ఆ గ్రామ ప్రజలు కోరుతూ గ్రామంలో ర్యాలీ తీశారు. జనవరి 1, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వుల లాంటివే 2013 లోనూ ఇచ్చారని వాటి వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళు స్పష్టం చేశారు.
జనవరి 1న పిసిబి ఉత్తర్వులలో చెరువు కాలుష్య నీటిని, మట్టిని ఎత్తి పోయాలని ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులలో ఉంది. ఇప్పుడా విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తూ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని ర్యాలీలో ప్రజలు స్పష్టం చేశారు.
కంపెనీకి బోర్డు జనవరి 1న ఇచ్చిన ఉత్తర్వులో (Order No. RCP-30/TGPCB/TF/HO/2026-29) తాము విధించిన షరతులను (Consent Conditions), జూలై 2021, జనవరి 2023, మే 2025 లలో జారీచేసిన నాటి తమ ఆదేశాలను అది బేఖాతరు చేస్తోందని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజా జె.ఏ.సి (TPJAC), కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (KVPC) నేతలు జనవరి 10న ఇచ్చిన ప్రకటన తెలియచేసింది.
కాలుష్య నియంత్రణ బోర్డు కంపెనీ లోని ZLD (సున్నా వ్యర్థాల విడుదల) వ్యవస్థ పనిచేయటం లేదని, ATFD మరియు బయోలాజికల్ ETP ప్లాంట్ల నుండి వెలువడుతున్న దుర్వాసనను అరికట్టడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని బయటపెట్టింది. గాలి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన స్క్రబ్బర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించి, ఆదేశాలను పాటించకపోతే ఎయిర్ యాక్ట్ 1981 సెక్షన్ 31(A) కింద ఎటువంటి నోటీసు లేకుండానే పరిశ్రమను మూసివేస్తామని (Closure of the Industry) బోర్డు తన ఉత్తర్వుల్లో హెటెరో యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరించింది.
గ్రామంలో నేడు జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన టీపీజెఏసీ (Telangana Praja Joint Action Committee) జిల్లా అధ్యక్షులు వై. అశోక్ కుమార్, “పాడైన చెరువు నీటిని, మట్టిని ఎవరు ఎత్తిపోయాలి. 12 ఏళ్లుగా విష వాయువులను వదిలి ప్రజల ఆరోగ్యాలను పాడు చేశారు ఎవరు బాగు చేయాలి, పశువుల మరణానికి మూల్యం ఎవరు చెల్లించాలి, వీటన్నింటి పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. దోమడుగులో గాలి, నీరు విషతుల్యం అయ్యి మహిళలకు గర్భవిచ్ఛిన్నం అవుతోంది, క్యాన్సర్ తదితర వ్యాధులు పెరుగుతున్నాయి, చిన్న పిల్లలు రకరకాల అకాల వ్యాధుల బారిన పడుతున్నారు, పశువులు చనిపోతున్నాయి, వ్యవసాయం పూర్తిగా నాశనమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవించే హక్కులో భాగంగా మంచి గాలి, స్వచ్ఛమైన నీరు పొందడం తమ హక్కని, వాటిని కాలరాస్తున్న హెటెరో డ్రగ్స్ యూనిట్-1ను వెంటనే మూసివేయాలని నినాదాలు ఇస్తూ ర్యాలీ జరిగింది. "సమస్య తీర్చని ప్రజాప్రతినిధులు మా ఊరికి ఓట్ల కోసం రావొద్దు" అని గ్రామస్తులు స్పష్టం చేశారు.
2022 నుండి 2025 వరకు ఎనిమిది సార్లు పీసీబీ తనిఖీలు చేసి కంపెనీ తప్పులు చేస్తున్నట్లు సాక్ష్యాలు దొరికినా కేవలం "ఆదేశాలు" ఇస్తోందని టీపీజెఏసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “కంపెనీని మూసివేయడం (Closure), క్రిమినల్ కేసులు పెట్టడం (Prosecution), లేదా నష్టపరిహారం వసూలు చేయడం వంటి కఠిన చర్యలు బోర్డు తీసుకోలేదు. ఇది సుప్రీంకోర్టు కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి అన్న తీర్పుల ఉల్లంఘన. వాళ్ళే చెరువును శుద్ధి చేసి బాధితులకు పరిహారం ఇవ్వాలి. పీసీబీ కేవలం 96 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీతో సరిపెట్టింది. చెరువు శుద్ధికి 18 నుండి 37 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా,” అని ప్రశ్నించింది.
హెటెరో డ్రగ్స్ నుండి వెలువడే రసాయనాలు (effluents) నల్లకుంట చెరువులోని కలుషితాలు ఒకటేనని శాస్త్రీయంగా రుజువయ్యింది. కంపెనీలోని సున్నా వ్యర్థాల విడుదల (Zero Liquid Discharge) సిస్టమ్ పూర్తిగా విఫలమైందని, ప్లాంట్ నుండి ప్రమాదకరమైన గాలి (VOCs) మరియు దుర్వాసన వెలువడుతోందని నివేదిక స్పష్టం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని టీపీజెఏసీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో టీపీజెఏసీ జిల్లా అధ్యక్షులు వై. అశోక్ కుమార్, రాష్ట్ర కో-కన్వీనర్ కన్నెగంటి రవి, జిల్లా కన్వీనర్ శ్రీధర్ మహేంద్ర, చంద్రారెడ్డి, క్లయిమేట్ ఫ్రంట్ బాధ్యులు రుచిత్, అభిలాష్ మరియు దోమడుగు కాలుష్య వ్యతిరేక కమిటీ కన్వీనర్లు బాల్ రెడ్డి, మంగయ్య, శారదమ్మతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.


