
ఆర్టీసిలో సమ్మె ప్రారంభం, పది వేల బస్సులు బంద్
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నడిమాండ్ కు సర్కారు విముఖ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ సహా మొత్తం 32 డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీనితో మంగ ళవారం అర్ధరాత్రి తొలిషిప్ట్ నుంచే సమ్మె మొదలయింది. ఫలితంగా అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి.
పలుచోట్ల కార్మికులు డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు జరిపారు. సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. రద్దీ మార్గాల్లో అద్దె బస్సులు నడపాలని, ప్రైవేటు వాహనాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
నిన్నరాత్రి ఏం జరిగిందంటే...
ఆర్టీసి కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటి (జేఏసీ) చేసిన డిమాండ్ లను పరిశీలించేందుకు,ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని, అప్పటివరకు సమ్మె వాయిదా వేయాలని చర్చల సమయంలో సంస్థ అధికారులు కోరారు.దీనికి కార్మిక నేతలు అంగీకరించలేదు. ఫలితంగా ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయని, సమ్మెలోకి వెళ్తున్నామని రాత్రి 9 గంటల తర్వాత జెఎసి నేతలు ప్రకటించారు. “ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్ర మే కోరుతున్నాము,”అని జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఆర్టీసీ అద్దె బస్సులతో కలిపి తెలంగాణ ఆర్టీసి సుమారు 10 వేల బస్సులు నడిపుతున్నది. రోజూ 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లోనే 25 లక్షల మందికి పైగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ప్రధాన మయిన డిమాండ్. దీనిమీద ప్రభుత్వం మొదటి నుంచీ విముఖంగానే ఉంది. మరొక ముఖ్యమయిన డిమాండ్ యూనియన్ల పునరుద్ధరణ. చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్ల ను జెఎసి ప్రభుత్వం ముందుంచింది. ఏ ఒక్క డదాని మీద స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు.
సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక రెండో సారి సమ్మె
సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి. మొదటి సారి 2019లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఏకంగా 55రోజుల పాటు సమ్మె చేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం సంఘాలన్నింటిని రద్దు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమ్మెలందుకు అనేది కెసిఆర్ ప్రభుత్వం విధానం. అపుడు సమ్మెలో పాల్గొన్న కార్మికులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇపుడు దాదాపు అవే డిమాండ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెండో సారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.
Live Updates
- 22 April 2026 9:15 AM IST
ముందుకు రాని అద్దె డ్రైవర్లు
సమ్మెకారణంగా బస్సుల రాష్ట్రమంతా నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కార్మిక నాయకులు తమ మాట వినలేదని యాజమాన్యం కోపం గా ఉంది. దీనితో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పరిమిత సంఖ్యలో బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అద్దె డ్రైవర్లను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సఫలం కావడం లేదు. పోలీసు బందోబస్తుఇస్తామని చెప్పినా తాత్కాలికంగా పనిచేసేందుకు డ్రైవర్లు ఎవరూ ముందుకురావడం లేదు. సమ్మెకారణంగా గొడవలు జరిగితే మొదటికే మోసం వస్తుందని బస్సులు నడిపేందుకు ప్రయివేటు డ్రైవర్లు ముందుకురావడం లేదని తెలిసింది.
- 22 April 2026 9:10 AM IST
కరీంనగర్ వద్ద అద్దె డ్రైవర్ తో ప్రమాదం
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతం కావడంతో ఎలాగైనా బస్సులు నడిపించాలని, కనీసం ఒక్కబస్సైనా డిపో నుంచి బయటకు తీసుకురావాలని యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. ఇలా చేసిన ఒక ప్రయత్నం బెడిసికొట్టింది. . కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఒక బస్సును అధికారు లు అద్దె డ్రైవర్ తో వరంగల్ కు పంపేందుకు ప్రయత్నించారు. బస్సైతే కదిలింది. రోడ్డెక్కింది. అల్గునూర్ దాకావచ్చింది. అక్కడ బస్సు అద్దె డ్రైవర్ అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టింది. బస్సు ముందు భాగం దెబ్బతినింది. ప్రాణాపాయం లేదు గాని కొందరికి గాయాలయ్యాయి. అంబులెన్స్ తెప్పించి వారిని ఆసుపత్రికి తరలించారు.
- 22 April 2026 9:03 AM IST
ఆర్టీసి కార్మికుల ప్రధాన డిమాండ్లు...
తెలంగాణలో ఆర్టీసీ (TGSRTC) కార్మికులు 32 డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలు, సమ్మెకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటే...
*ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం (Merger): ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించి, సంస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కార్మికుల దశాబ్దాల ప్రధాన డిమాండ్.
*వేతన సవరణ (Wage Revision): 2021 వేతన సవరణను అమలు చేయడంతో పాటు, 30 శాతం ఫిట్మెంట్ కల్పించాలని కోరుతున్నారు.
*కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
*నిలిచిపోయిన బకాయిల చెల్లింపు: పెండింగ్లో ఉన్న డీఏ (DA), ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నారు.
*ప్రైవేటీకరణకు వ్యతిరేకం: అద్దె బస్సులు, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను నిలిపివేయాలని, సంస్థను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లకూడదని డిమాండ్ చేస్తున్నారు.
*ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ: ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, తాత్కాలిక సిబ్బందిని క్రమబద్ధీకరించాలని (Regularisation) కోరుతున్నారు.
*పని పరిస్థితుల మెరుగుదల: 8 గంటల పని దినాన్ని అమలు చేయడం, మహిళా సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం, 2019 సమ్మె నాటి పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం
- 22 April 2026 9:00 AM IST
గోదావరిఖనిలో...
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు. బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు. గోదావరిఖని బస్టాండ్, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
- 22 April 2026 8:47 AM IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమ్మెకారణంగా సిబ్బంది విధులకు రాకపోవడంతో పోలీసుల బందోబస్తు మధ్య ఆర్టీసి యాజమన్యం అద్దె బస్సులు నడపేందుకు ప్రయత్నిస్తున్నది. అకయితే, ఇలా ఒక బస్సు నడిపేందుకు డ్రైవర్ యత్నించగా ఆ బస్సును అడ్డుకొని ఆర్టీసీ కార్మికులు గాలి తీసేశారు. దీనితో పాలీసులకు, సిబ్బందికి తోపులాట జరిగింది.
- 22 April 2026 8:42 AM IST
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది డిపోలకు చెందిన 850 బస్సులు సమ్మె పిలుపుతో డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లావ్యాపితంగా అర్ధరాత్రి నుంచే 3,850 మంది కార్మికులు డ్యూటికి దూరంగా ఉంటూ ఆందోళన చేపట్టారు.
- 22 April 2026 8:34 AM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చెందుకుతున్నారు. ఈ రోజు వర్కింగ్ డే కావడంతో కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైళ్లు,సెట్విన్ బస్సులు కిటకిటలాడుతున్నయి. సెట్విన్ బస్సుల్లో పెరిగిన ధరలు పెంచారు. ఆటో లకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నరు..
- 22 April 2026 8:31 AM IST
సూర్యాపేట జిల్లా...
సూర్యాపేట డిపోలో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఎలెక్ట్రిక్ బస్సులనైనా నడిపించేందుకు అధికారులు తెగ ప్రయత్నిస్తున్నారు. కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తున్నది కోదాడ డిపోలో 80 బస్సులో డిపోలో నిలిచిపోయాయి. జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ బస్సులను సూర్యాపేట డిపోలో నడిపించేందుకు డిపో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు.

