
మావోయిస్టులకు భారీ షాక్.. సీనియర్ నేత కాకరాల సమత లొంగుబాటు
తెలంగాణ పోలీసుల ఎదుట సీపీఐ మావోయిస్టు సీనియర్ నేత కాకరాల సమత లొంగిపోయారు. 2026లో ఇప్పటివరకు 265 మంది మావోయిస్టులు లొంగుబాటు.
తెలంగాణలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్ నేత, స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి, దుర్గ, షకీలా, మేస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆగస్టు 10న తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో ఆమె ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. కాకరాల సమతకు మహిళా సమస్యలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్, ప్రచార బాధ్యతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కీలక నష్టంగా తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.
రాజమండ్రిలో జన్మించిన సమత
కాకరాల సమత స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ సినీ నటుడు. ఆయన సుమారు 300 సినిమాల్లో నటించారు. తల్లి కాకరాల సూర్యకాంతం అనారోగ్యంతో 2021లో మరణించారు. సత్యనారాయణ 1960లో రాజమండ్రి నుంచి చెన్నైకి వెళ్లారు. 2006లో హైదరాబాద్కు మారారు. సమతకు ఒక అక్క కాకరాల సునీత అలియాస్ బద్రి ఉన్నారు. ఆమె కూడా గతంలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2025 ఆగస్టు 21న రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
చదువు మధ్యలోనే ఉద్యమంలోకి
సమత 1971 నుంచి 1984 వరకు చెన్నైలోని కర్ణాటక సంఘ హైస్కూల్లో చదువుకున్నారు. 1984లో చెర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్మీడియట్లో చేరారు. 1985లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగానే చదువు ఆపేశారు. అనంతరం సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్లో చేరారు. చిన్నప్పటి నుంచే ఆమె కుటుంబానికి మావోయిస్టు భావజాలంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు మిలిటెంట్ నేతలు, సాంస్కృతిక కార్యకర్తలు వారి ఇంటికి వచ్చేవారని చెప్పారు. దీంతో సమత ఆ భావజాలం వైపు ఆకర్షితులయ్యారని వివరించారు.
1985లో పార్టీ సభ్యురాలిగా ప్రారంభం
1985 నవంబర్లో విశాఖ జిల్లా కమిటీలోని మహిళా విభాగంలో పార్టీ సభ్యురాలిగా చేరారు. 1991లో ఏసీఎంగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నగరానికి కేంద్ర నిర్వాహకురాలిగా పంపించారు. 1994లో డీసీఎంగా ఎదిగి హైదరాబాద్ సిటీ కమిటీలోకి వెళ్లారు. 1999లో ఆమెను మహబూబ్నగర్లోని అచ్చంపేట దళానికి, నల్లమల ప్రాంతానికి బదిలీ చేశారు. 2002లో నల్లమల ఫారెస్ట్ డివిజన్ కమిటీలోకి పంపించారు.
2003లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగారు.
2005లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర బీహార్ ప్రాంతాలతో కూడిన ప్రత్యేక కమిటీకి పంపించారు. అక్కడ మహిళా సంఘానికి మార్గనిర్దేశం చేశారు. 2007 వరకు అక్కడే పనిచేశారు. 2007 చివర్లో గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణె వరకు ఉన్న ప్రాంతంతో కూడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేశారు. 2008 వరకు అక్కడ కొనసాగారు. 2009 జనవరిలో దండకారణ్య సౌత్ జోనల్ కమిటీకి బదిలీ అయ్యారు. 2015 వరకు అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి వద్ద సెంట్రల్ కమిటీ సిబ్బందిగా పనిచేశారు. 2015లో ఆమెను సౌత్ రీజినల్ బ్యూరో పట్టణ ప్రాంతానికి మార్చారు. అక్కడ మహిళా సమస్యలు, ఇంటెలిజెన్స్, ప్రచార బాధ్యతలు అప్పగించారు.
వ్యక్తిగత జీవితంలోనూ విషాదాలు
సమత 1991 ఆగస్టు 4న మాజీ పార్టీ నేత మేకల దామోదర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయన 1997 మార్చి 21న మెదక్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆ తర్వాత 2000 సెప్టెంబర్ 11న మాజీ సీసీఎం, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ పటేల్ సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయన 2009 మే 24న వరంగల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు.
రూ.20 లక్షల ఆర్థిక ప్రయోజనం
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం సమతకు అర్హత ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు ద్వారా అందించారు. అదనంగా రూ.25 వేల మధ్యంతర ఆర్థిక సాయం కూడా అందించారు. ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం మరిన్ని ప్రయోజనాలు ఆమెకు అందనున్నాయి. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2024 నుంచి 2026 మధ్య లొంగిపోయిన వారికి హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
265 మంది లొంగుబాటు
తెలంగాణలో 2026లో ఇప్పటివరకు 265 మంది అండర్గ్రౌండ్ మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 12 మంది స్టేట్ కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు ఉన్నారు. అలాగే 24 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు లేదా సభ్యులు, 94 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు లేదా సభ్యులు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. ఇదే సమయంలో 2026లో 238 తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2024 నుంచి 2026 వరకు మొత్తం 823 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ కాలంలో మొత్తం 334 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ఇంకా అండర్గ్రౌండ్లో
తెలంగాణకు చెందిన యాక్టివ్ అండర్గ్రౌండ్ మావోయిస్టులు ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు తెలంగాణ వెలుపల వివిధ దళాల్లో ఉన్నట్లు వెల్లడించారు. వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పీబీఎం కూడా ఉన్నారు. జాడే రత్నాబాయి అలియాస్ సుజాత, వర్థ శేఖర్ అలియాస్ మంతు మిగిలిన ఇద్దరుగా తెలిపారు. వారు కూడా ఆయుధ పోరాటాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా అందించే ప్రయోజనాలను పొందాలని కోరింది. కాకరాల సమత లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో మరో కీలక నాయకురాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చినట్టైంది. మిగిలిన వారు కూడా ప్రభుత్వ పునరావాస విధానాన్ని ఉపయోగించుకుని సాధారణ జీవితంలోకి రావాలని ప్రభుత్వం కోరుతోంది.

