తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు...
x

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు...

‘ఇన్వెస్ట్ తెలంగాణ’.. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2.0కు గ్రీన్‌సిగ్నల్!


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, గృహ నిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు వంటి కీలక రంగాలపై కేబినెట్‌ చర్చించింది.పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

విద్యార్థులకు పౌష్టికాహారం నుంచి అత్యాధునిక వైద్య సేవల వరకు.. విద్యుత్‌ రంగ సంస్కరణల నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టు భూసేకరణ వరకు పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే భూసేకరణకు ప్రత్యామ్నాయంగా కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీ తీసుకొచ్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మరో భారీ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0ను డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. గత ఏడాది కంటే మరింత ఘనంగా ఈ సదస్సును నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో సదస్సు జరగనుంది. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు.. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రదర్శించనున్నారు.

తెలంగాణలోని స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలను ప్రపంచానికి పరిచయం చేసేలా గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వివిధ రంగాల్లో వస్తున్న కొత్త ఆవిష్కరణలను కూడా ప్రపంచ పెట్టుబడిదారుల ముందుకు తీసుకెళ్లనున్నారు. సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక విధానాలు, భవిష్యత్‌ ప్రాజెక్టులను ఈ సమ్మిట్‌ ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. అంటే.. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలంగా నిలబెట్టడమే ఈ సమ్మిట్‌ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యార్థులు ఆకలితో కాకుండా ఆరోగ్యంగా తరగతులకు హాజరై చదువుపై దృష్టి పెట్టేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యం, హాజరు శాతం, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ TIMS ఆసుపత్రులను NIMS తరహాలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 6,278 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వైద్య సిబ్బంది పెరగడంతో ఆసుపత్రుల్లో సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అదే సమయంలో వేలాది ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరితే పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంపై ప్రభుత్వం మరోసారి దృష్టి పెట్టింది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో విడతకు సంబంధించి ఇళ్ల నిర్మాణం స‌కాలంలో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇళ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం సమయానికి అందేలా పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించారు.

తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యుత్‌ సరఫరాలో నష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ RDSS పథకంలో డిస్కంలను చేర్చేందుకు కేబినెట్‌ తుది ఆమోదం తెలిపింది. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడంతో పాటు విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్ల ఆధునీకరణకు అవకాశం ఉంటుంది. అలాగే వినియోగదారుల విద్యుత్‌ వినియోగాన్ని మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు కూడా RDSSలో కీలక అంశంగా ఉంది.

వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే మరో కీలక నిర్ణయాన్ని కేబినెట్‌ తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ కోసం రూ.587 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీటి లభ్యత పెరగనుంది. భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా నిధులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భూసేకరణకు ప్రత్యామ్నాయంగా కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీ తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. పెద్ద ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అవసరమైన భూమిని సేకరించే సమయంలో నేరుగా భూసేకరణ చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించడమే ల్యాండ్‌ పూలింగ్‌ విధానం ఉద్దేశం. భూయజమానులకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా ఈ విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు ఇచ్చే యజమానులకు తగిన ప్రయోజనం కల్పిస్తూ అదే సమయంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమీకరించే విధంగా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు.

మొత్తంగా చూస్తే, తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలు కీలక రంగాలను టచ్‌ చేశాయి. ఒకవైపు విద్యార్థులకు పౌష్టికాహారం, మరోవైపు TIMS ఆసుపత్రులకు వేలాది కొత్త పోస్టులు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతుల కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు భూసేకరణ నిధులు, విద్యుత్‌ రంగంలో RDSS సంస్కరణలు.. పారిశ్రామిక పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0.. అలాగే భూసేకరణకు ప్రత్యామ్నాయంగా కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీ. ఈ నిర్ణయాలన్నింటి ద్వారా సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, పెట్టుబడులు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

Read More
Next Story