
తెలంగాణలో ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ.. దేశంలోనే నెం.1
వివిధ వ్యాధుల చికిత్స ఖర్చులు జాతీయ సగటును మించిపోయి, కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని నివేదిక తెలిపింది.
దేశంలోనే వైద్యం అత్యంత కాస్ట్లీగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ కూడా చేరింది. తాజాగా ఒక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో ఆస్పత్రి ఖర్చులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని వెల్లడైంది. హార్ట్ వ్యాధుల చికిత్స ఖర్చు ఇందులో ముందంజలో ఉంది. ఒక్కసారి ఆస్పత్రిలో చేరితే సగటున రూ.95,095 వరకు ఖర్చవుతోంది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 70 శాతం ఎక్కువ. ఇన్ఫెక్షన్లకు రూ.24,496 ఖర్చవుతుండగా, గాయాలకు రూ.77,518 వరకు వెళ్తోంది. కంటి చికిత్స కూడా సగటున రూ.28,897గా ఉంది. ఇతర వ్యాధుల్లో కూడా ఖర్చులు ఎక్కువగానే నమోదయ్యాయి.
క్యాన్సర్ చికిత్సకు రూ.94,047, రక్త సంబంధిత సమస్యలకు రూ.38,258 ఖర్చవుతోంది. మెటబాలిక్, హార్మోన్ సమస్యలకు దాదాపు రూ.50 వేల వరకు వెళ్తోంది. మానసిక, నర సంబంధిత వ్యాధులకు రూ.79,769 వరకు ఖర్చవుతోంది. జెనిటో-యూరినరీ సమస్యలకు సుమారు రూ.45 వేల వరకు ఖర్చవుతుండగా, మరికొన్ని వ్యాధుల్లో రూ.35 నుంచి రూ.40 వేల వరకు ఖర్చులు నమోదయ్యాయి. ఇవన్నీ జాతీయ సగటుతో పోలిస్తే 50 నుంచి 60 శాతం ఎక్కువగా ఉన్నాయి. శ్వాసకోశం, జీర్ణకోశం, కండరాలు, ప్రసూతి సేవల్లో కూడా 40 నుంచి 80 శాతం వరకు అధిక ఖర్చులు ఉన్నట్లు నివేదిక తెలిపింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రైవేట్ ఆస్పత్రులపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన పరీక్షలు, చికిత్స విధానాలు ఖర్చులను పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇంకా ఒక సర్వే ప్రకారం, కుటుంబాలు తీసుకునే అప్పుల్లో దాదాపు 10 శాతం వైద్య అవసరాలకే వెళ్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ భారం మరింత పెరుగుతోంది. ధరల విషయంలో స్పష్టత లేకపోవడం, బిల్లింగ్ నియంత్రణ లోపాలు కూడా సమస్యగా మారుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

