
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘‘వేగవంతమైన సాంకేతికతతో ప్రపంచ కేంద్రం మారుతోంది’’
ప్రధాన నరేంద్ర మోదీ
వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పురోగతి ప్రపంచ శక్తి కేంద్రాన్ని పునర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
సాంకేతికత, శక్తి మార్పు..
"ప్రపంచ వ్యూహాత్మక సమీకరణం వేగంగా మారుతోంది. ప్రధానంగా సాంకేతిక పురోగతి వేగం కారణంగా ప్రపంచ శక్తి సమతుల్యత క్షణక్షణానికీ అభివృద్ధి చెందుతోంది. రాబోయే 20 లేదా 30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు... ప్రపంచం, సాంకేతికత, పరిశ్రమలు, వృత్తులు అన్నీ అభివృద్ధి చెందుతాయి.
కానీ వీటన్నిటి మధ్య, ఒక విషయం గుర్తుంచుకోండి. నిరంతరం నేర్చుకునేవారే విజయం సాధిస్తారు," అని ప్రధాని మోదీ అన్నారు. నిరంతర మార్పులతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని, దీర్ఘకాలిక విజయంలో జీవితకాల అభ్యాసం ఒక నిర్ణయాత్మక అంశం అవుతుందని ఆయన విద్యార్థులకు సూచించారు.
పట్టభద్రులవుతున్న విద్యార్థుల ఆకాంక్షలను ప్రస్తావిస్తూ.. ‘‘మీ మనసులో ఎక్కడో మరో ఆలోచన సాగుతూ ఉండవచ్చు. నేను బాబా బాగేశ్వర్ను కాకపోవచ్చు, కానీ కచ్చితంగా ప్రతి విద్యార్థి మనసులోనూ ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై ఒక దార్శనికత ఉండే అవకాశం ఉంది..." అని మోదీ అన్నారు.
పరిశోధనకు ప్రోత్సాహం..
యువ ఆవిష్కర్తలకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుతూ... దేశంలో పరిశోధనను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. "మీ అందరి ముందు మరో ప్రధాన అవకాశం ఉంది. ఆ కొత్త అవకాశం పరిశోధన రంగంలో ఉంది... ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్ మన ప్రతిభావంతులైన యువతకు పరిశోధనలు చేసే అవకాశాలను అందిస్తోంది," అని ఆయన అన్నారు.
"కొత్త ఆలోచనల పురోగతికి వీలు కల్పించేందుకు 'పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ పథకం' ప్రారంభించబడింది. దేశంలో సైన్స్, పరిశోధనలకు కొత్త ఊపునిచ్చేందుకు జాతీయ పరిశోధన ఫౌండేషన్ కూడా స్థాపించబడింది.
పరిశోధన రంగానికి రూ. 1 లక్ష కోట్ల వరకు నిధులు సమకూరుస్తున్నారు... 'ఒక దేశం ఒక చందా' కార్యక్రమం ద్వారా, ప్రతిష్టాత్మక ప్రపంచ పరిశోధన జర్నల్స్ ఇప్పుడు దేశంలోని అతి చిన్న పట్టణాలకు కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా చేరుతున్నాయి" అని ప్రధాని మోదీ తెలిపారు.
జాతికి సేవలు చేయండి..
దేశ భవిష్యత్తులో పట్టభద్రులు పోషించబోయే పాత్ర గురించి ప్రస్తావిస్తూ "...ప్రతి తరం తమ కాలంలోని నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని, అలాగే తమ సొంత జాతీయ బాధ్యతను కూడా మోస్తుందని మీ అందరికీ తెలుసు... మీ జీవితంలోని రాబోయే 30 నుంచి 35 సంవత్సరాలలో మీరు చేసే ప్రతి పని 'వికసిత్ భారత్' వైపు మన ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆధారం ఇది కూడా అయి ఉండాలి. ఇది దేశానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? ఇది దేశం ఏ అవసరాలను తీరుస్తుంది?"
సూపర్ కంప్యూటర్ ప్రారంభం..
ఈ కార్యక్రమంలో, ఐఐటి ఢిల్లీలోని సోనిపట్ క్యాంపస్లో ఏఐ ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సదుపాయమైన 'పరం ప్రజ్ఞ'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదుపాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటింగ్, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలలో సంస్థ పనిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ స్నాతకోత్సవంలో 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో సహా 3,000 మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు.
Next Story

