
అస్సాం ఓటర్ల మైండ్ సెట్ లో మార్పు వచ్చిందా?
మత ప్రాతిపదికన ఓట్లను అభ్యర్థిస్తున్న బీజేపీ
తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలలో కమలదళం మతం ప్రాతిపదికన ఓట్లను అభ్యర్థించింది. హిందువులను ఏకీకృతం చేయడంలో పార్టీ విజయం సాధించిందా లేదా రాష్ట్ర ఎన్నికల వాతావరణంలో తేడా వచ్చిందా?
ఈ ఫలితాలు అనేక నియోజకవర్గాలలో, ముఖ్యంగా ఎగువ అస్సాంలో, ఒక విస్మయకరమైన ధోరణిని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షంలోని అనేక ప్రముఖ హిందూ నాయకులు ఓడిపోగా, కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలిగారు.
నౌబోయిచా నుంచి జయప్రకాష్ దాస్ గెలుపొందగా, శివసాగర్లో అఖిల్ గోగోయ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నౌబోయిచా షెడ్యూల్డ్ కులాల (SC) కోసం రిజర్వ్ చేయబడినప్పటికీ, అక్కడ ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఇది ఫలితాన్ని రాజకీయంగా సంక్లిష్టంగా మార్చింది. మరోవైపు, అఖిల్ గోగోయ్కు ఉన్న బలమైన స్థానిక మద్దతు కారణంగా ఆయన విజయం చాలా వరకు ఊహించినదే.
మతపరమైన అంశాలపై ఆందోళన.
ప్రతిపక్షం సాధించిన పరిమిత స్థానాలలో, హిందూ వర్గాల నుంచి కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. అస్సాంలో ప్రతిపక్ష స్థానం క్రమంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలకే పరిమితమవుతోందన్న బీజేపీ చిరకాల రాజకీయ వాదనకు ఇది మరింత బలాన్ని చేకూర్చింది.
అదే సమయంలో, ఎన్నికల పోటీలలో పెరుగుతున్న మతపరమైన ధోరణిపై విశ్లేషకులలో ఆందోళనలను రేకెత్తించింది. ఈ ధోరణిని కేవలం మతపరమైన కోణంలోనే చూడటంలో జాగ్రత్త వహించాలని రాజకీయ విశ్లేషకుడు ప్రసేన్జిత్ బిస్వాస్ కోరారు.
“విభజన రాజకీయాలు, వర్గాలను మూస పద్ధతిలో చూడటం హిందూ మితవాదుల వ్యూహంలో భాగం. కానీ, ప్రాతినిధ్యాన్ని హిందువులు, ముస్లింలకు పరిమితం చేయడం సమస్యాత్మకంగా చూడాలి. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఘన విజయం సాధించిన సంగతిని మనం ప్రత్యేకంగా చూడాలి.
అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభా వాటా కంటే తక్కువగానే ఉందని విశ్లేషకుడు ఎత్తి చూపారు. “సంఖ్యలను పరిశీలిస్తే, ఓటర్లలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ వారి ప్రాతినిధ్యం గతంలో కంటే తక్కువగా ఉంది” అని ఆయన అన్నారు.
ప్రత్యామ్నాయాలు లేవు..
మైనారిటీ నాయకుడు ఇక్రముల్ హుడా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అస్సాంలో రాజకీయ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతోనే ఈ ఓటింగ్ సరళి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
"ఈ రోజు కాంగ్రెస్ ఎక్కువగా మైనారిటీ ఓట్లపై ఆధారపడి ఉంది. కానీ అది పూర్తిగా దాని సొంత బలం వల్ల కాదు. ముస్లింలకు వేరే ప్రత్యామ్నాయం లేదని వారు భావించడమే దీనికి కారణం. గతంలో కొందరు ఏఐయూడీఎఫ్ను విశ్వసించేవారు. కానీ కాలక్రమేణా ఆ మద్దతు బలహీనపడింది" అని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల పునర్విభజన ప్రభావాన్ని కూడా హుడా ప్రముఖంగా ప్రస్తావించారు. "ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య 32 నుంచి 22కు తగ్గింది. ఓటర్లలో ఒకరకమైన భయం కూడా నెలకొని ఉంది. అది నేరుగా కాంగ్రెస్ ఓట్ల సంఖ్యను ప్రభావితం చేస్తుంది" అని ఆయన అన్నారు.
హిందువులు బీజేపీకి అనుకూలంగా..
హిందూ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోటీలలో కాంగ్రెస్ ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. ఆ పార్టీ గెలిచిన సీట్లలో కేవలం కొన్ని మాత్రమే బీజేపీతో నేరుగా పోటీ జరిగింది. ముఖ్యంగా ధుబ్రి, బిర్సింగ్ జరువా, సమగురి, కరీంగంజ్ నార్త్ వంటి నియోజకవర్గాలలో, వీటన్నింటిలో ముస్లిం ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది. అనేక ఇతర సీట్లలో, ఆ పార్టీ అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) వంటి NDA మిత్రపక్షాలకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వచ్చింది.
ఈ నియోజకవర్గాల్లోని ఓటింగ్ సరళి వాటి జనాభా తో దగ్గరగా ముడిపడి ఉందని హుడా వివరించారు. "ధుబ్రిలో, దాదాపు 75 శాతం ఓటర్లు ముస్లింలు కాగా, సుమారు 24 శాతం హిందువులు ఉన్నారు. బిర్సింగ్ జరువాలో, ముస్లింలు దాదాపు 80 నుంచి 85 శాతం ఉండగా, హిందువులు సుమారు 15 నుంచి 20 శాతం ఉన్నారు. సమగురిలో, ముస్లింలు దాదాపు 60–65 శాతం, హిందువులు 35–40 శాతం ఉన్నారు. కరీంగంజ్ నార్త్లో, ముస్లింలు సుమారు 55–60 శాతం ఉండగా, హిందువులు దాదాపు 40–45 శాతం ఉన్నారు" అని ఆయన అన్నారు.
"హిందూ ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు ఉన్నందున, ఈ స్థానాల్లో అది రెండో స్థానంలో నిలవగలుగుతోంది. కానీ కాంగ్రెస్కు అనుకూలంగా గెలుపు మార్జిన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని హుదా పేర్కొన్నారు.
నాగావ్ జిల్లాలోని రూపాహిహాట్, ధింగ్ వంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన ఓటింగ్ సరళిని చూడవచ్చని, అక్కడ జనాభా సమతుల్యత ఎన్నికల ఫలితాలలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ప్రాంతీయ పార్టీల క్షీణిస్తున్న ప్రభావం
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) ప్రభావం తగ్గడం కూడా మారుతున్న రాజకీయ సమీకరణాలకు దోహదపడింది. ఒకప్పుడు మైనారిటీ రాజకీయాల్లో కీలక శక్తిగా భావించిన ఈ పార్టీ, ఈసారి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దాని అధినేత బద్రుద్దీన్ అజ్మల్ బినకండి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. "ఆ నియోజకవర్గంలోని ఓటర్లతో అజ్మల్కు వ్యక్తిగత సంబంధం ఉంది. ఆయన గెలవడానికి అది కూడా ఒక కారణం" అని హుదా అన్నారు.
గణనీయమైన సంఖ్యలో సీట్లలో పోటీ చేసినప్పటికీ, బీజేపీ, బీపీఎఫ్లతో పోలిస్తే ఏజీపీ విజయాల శాతం తక్కువగానే ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఏజీపీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత సవాళ్లను ఎత్తి చూపారు. "అనేక నియోజకవర్గాల్లో మాకు కఠినమైన సీట్లు ఇస్తుండగా, బీజేపీ అనుకూలమైన స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే, మా ఓటర్లు బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ, దీనికి విరుద్ధంగా ఎల్లప్పుడూ జరగదు" అని ఆయన అన్నారు.
ఒకప్పుడు ప్రాంతీయ శక్తుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ రంగంలోకి బీజేపీ క్రమంగా విస్తరించడమే ఈ మార్పుకు ప్రధాన కారణం. గుర్తింపు రాజకీయాలను సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో మేళవించడం ద్వారా, ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలను తమ ప్రాథమిక ప్రతినిధులుగా భావించిన వారితో సహా, విస్తృత శ్రేణి ఓటర్లను ఆకట్టుకోవడంలో ఈ పార్టీ విజయం సాధించింది.
ద్వంద్వ వ్యూహం..
సాంస్కృతిక గుర్తింపును, పరిపాలనను కలపడం అనే ఈ ద్వంద్వ వ్యూహం, రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా బీజేపీ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి దోహదపడిందని బిస్వాస్ అన్నారు. "ఏజీపీకి చెందిన ముస్లిం అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థుల చేతిలో ఎక్కువగా ఓడిపోతూ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారనే అంతర్లీన ధోరణి కూడా ఉంది. మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో పార్టీ విజయాల శాతం తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది" అని బిస్వాస్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల రాజకీయాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని, ఇక్కడ సాంప్రదాయ విధేయతలు పునర్నిర్మించబడుతున్నాయని, పొత్తులు మారుతున్నాయని, ఓటర్ల ప్రవర్తన గుర్తింపు, అభివృద్ధి, రాజకీయ వ్యూహాల మిశ్రమంతో ఎక్కువగా ప్రభావితమవుతోందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి
Next Story

