
మధ్య తరగతి ప్రజలను మభ్య పెడుతున్న రేవంత్ ప్రభుత్వం
మధ్యతరగతి కోసమా ?నిధుల కోసమా?
మరోసారి భూములను వేలం వేయబోతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలను మభ్య పెడుతోంది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ప్లాట్లు వేలం వేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే గడచిన అనుభవాలను చూస్తే ప్రభుత్వం వేలం వేయబోయే ప్లాట్లు అధిక ఆదాయ వర్గాలు లేదా పారిశ్రామికవర్గాల కోసమే అన్న విషయం అర్ధమవుతోంది. రు. 2 వేల కోట్లను సమీకరించటమే లక్ష్యంగా ఈనెల 24వ తేదీనుండి సెప్టెంబర్ 2వ తేదీవరకు నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లో 5 ఎకరాలను ప్లాట్లుగా వేసి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటి ఆధ్వర్యంలో వేలం వేయబోతోంది.
గతంలో కూడా మధ్య తరగతి కోసమే అని కొన్ని ప్లాట్లను ప్రభుత్వం వేలంవేసిన విషయం తెలిసిందే. మోకిలాలో చదరపు గజానికి ప్రభుత్వం రు. 50 వేలు ధర్ నిర్ణయించగా వేలంలో సగటును రు. 75,640కి అమ్ముడుపోయింది. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన చదరపు గజం రు. 50 వేలు కూడా మధ్య తరగతి జనాలకు అందుబాటులోని ధర అన్న విషయం తెలిసిందే. మోకిలా ఏరియాలో వేసిన వేలంలో గరిష్టంగా చదరపు గజం రు. 1.09 లక్షలకు అమ్ముడుపోయింది. మధ్యతరగతి జనాలు ఎవరైనా చదరపు గజాన్ని లక్ష రూపాయలకు కొనగలరా ? అప్పట్లో వేలం ద్వారా ప్రభుత్వం 100 ప్లాట్లను అమ్మగా రు. 231 కోట్ల ఆదాయం వచ్చింది. 24వ తేదీన మొదలవ్వబోయే ప్లాట్ల వేలంపాటలో కూడా చదరపు గజం సుమారుగా లక్ష రూపాయలకు అమ్ముడూపోతుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్ధితిలో మధ్య తరగతి ప్రజలకోసమే ప్లాట్ల వేలంపాట అని ప్రభుత్వం చేసిన ప్రకటనను ఎవరూ నమ్మటంలేదు.
దీనిగురించి రియల్టర్ నందిరామేశ్వరరావు మాట్లాడుతూ, వీటివల్ల ఉపాధి, ఉద్యోగాలు, పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. 2019 లో నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లో ఎకరా రు. 39 కోట్లు ఉంటే 2023లో 100 కోట్లకి, 2025 లో 177 కోట్లకి, 2026 లో గరిష్టంగా 237 కోట్లకు పెరిగిందని అన్నారు. ప్రముఖులైన సల్మాన్ ఖాన్, అదాని, అంబాని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయంటే ఈ పెరుగుదల వల్లేనని అన్నారు. ఈ ఉపాధి అవకాశాల వల్ల మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోగల స్తోమత పెరుగుతుందని, దీన్ని ప్రగతిలో భాగంగా చూడాలని అన్నారు.
యాక్టివిస్ట్ కృష్ణకుమారి మాట్లాడుతూ, ఇది పూర్తిగా అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ఆదాయం కోసం చేస్తున్న పని అన్నారు. ప్రభుత్వం అమ్మే భూములవల్ల వ్యాపార వర్గాలు తప్ప ప్రజలు లాభపడే అవకాశమే లేదని అన్నారు. అంతే కాకుండా వీటి కోసం రైతులకి ఉపయోగపడే నీళ్ళు,కరెంట్, అలాగే సహజవనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయని అన్నారు.

