యువత, నిరుద్యోగులను మరచిపోయిన రేవంత్
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా కనీసం లక్ష ఉద్యోగాలను కూడా భర్తీచేయలేదు
జెన్ జీ జపం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని మాత్రం మరచిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 5 లక్షలమంది యువతకు ఉపాధి కల్పించటానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా కనీసం లక్ష ఉద్యోగాలను కూడా భర్తీచేయలేదు. అలాగే 5 లక్షలమంది యువతకు స్వయం ఉపాధి ప్రకటనను పూర్తిగా గాలికి వదిలేశారు.
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యుడిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయగానే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే వయసును 25 నుండి 21కి తగ్గించాలనే డిమాండ్ మొదలుపెట్టడమే విచిత్రంగా ఉంది. పోటీచేసే వయసును తగ్గించాలనే డిమాండ్ అచ్చంగా జెన్ జీని ఆక్టుకోవాలనే వ్యూహం తప్ప ఇంకేమీ కనబడటంలేదు. తన డిమాండును ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలించాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ తెలంగాణలోని నిరుద్యోగులు, యువతను మాత్రం గుర్తుచేసుకోవటంలేదు.
రెండున్నరేళ్ళల్లో రేవంత్ ప్రభుత్వం భర్తీచేసింది కేవలం 70 వేల ఉద్యోగాలు మాత్రమే. రాజీవ్ పథకంలో లబ్దికి యువత 14 లక్షల దరఖాస్తులు చేసుకుంటే అందులో నుండి 6 లక్షల దరఖాస్తులను ప్రభుత్వం అర్హమైనవిగా గుర్తించింది. అయితే ప్రభుత్వం దరఖాస్తులు అందుకుని ఏడాది అయినా ఇప్పటికీ పథకాన్ని అమలుచేసే విషయాన్ని రేవంత్ ఆలోచించటంలేదు. 2025-26 బడ్జెట్ లో ఈ ఉపాధి పథకానికి రు. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పథకాన్ని అమల్లోకి తీసుకురాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

