‘‘ఒకదాని తరువాత ఒకటి, వరుసగా వాహనాల ఢీ‘‘
x

‘‘ఒకదాని తరువాత ఒకటి, వరుసగా వాహనాల ఢీ‘‘

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ అయిన ఓ ట్రక్కు తన ఎదురుగా ఉన్న కారును ఢీ కొట్టింది. కారు ముందు మరో ట్రక్కులోకి కారు దూసుకెళ్లడంతో అందులో ఉన్నవారు మృత్యువాత పడ్డారు.

ఆ తరువాత వరుసగా వాహనాలు ఢీ కొట్టడంతో మంటల చెలరేగి 11 మంది మరణించారు. ఇందులో చిన్నారులు ఉండటం అందరిని కలిచివేసింది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయని ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ తెలిపారు.

ఈ ఘటనను "అత్యంత విషాదకరమైన, హృదయ విదారకమైన" సంఘటనగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల పట్ల సంతాపం తెలిపారు. జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, డ్రామాండ్‌గంజ్ లోయ నుంచి లసోడా వైపు వెళ్లే జాతీయ రహదారి-135పై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో, కొండ దిగువకు ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల, దాని ముందు వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు ట్రక్కుల మధ్య ప్రయాణిస్తున్న ఒక కారు ఈ ధాటికి నుజ్జునుజ్జు అయింది. ఆ తర్వాత జరిగిన వరుస ప్రమాదాల్లో, మరో కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని కౌశిక్ చెప్పారు.
“పోలీసులు, స్థానికులతో కలిసి నుజ్జునుజ్జు అయిన వాహనాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి” అని ఎస్పీ తెలిపారు. మృతుల్లో ఏడుగురు మీర్జాపూర్ జిల్లాకు చెందినవారని, ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, ఒకరు పొరుగున ఉన్న సోన్‌భద్ర జిల్లాకు చెందినవారని జిల్లా మేజిస్ట్రేట్ పవన్ గంగ్వార్ పీటీఐకి తెలిపారు.
మీర్జాపూర్‌లోని జిగ్నా ప్రాంతానికి చెందిన మృతులలో శివ సింగ్ (8), సోనమ్ సింగ్ (9), పియూష్ సింగ్ (14), పంకజ్ సింగ్ (40), వందన సింగ్ (43), విష్ణు సింగ్ (45) వీణా సింగ్ (47) ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇతరులలో మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన కార్తికేయ సింగ్ (18) ప్రియాంక సింగ్ (42), మధ్యప్రదేశ్‌లోని సాగర్‌కు చెందిన వికాస్ శర్మ (32), సోన్‌భద్రకు చెందిన జై ప్రకాష్ (27) ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బీహార్ రిజిస్ట్రేషన్ నంబరు గల ఒక ట్రక్కు, మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు గల మరో వాహనం ప్రమాదంలో ఉన్నట్లు తేలింది.
కార్లలో ఒకటి సోన్‌భద్ర జిల్లాకు చెందినది కాగా, మరొకటి మీర్జాపూర్‌కు చెందినది. “మీర్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విషాదకరం, హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.” “గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం” అని సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
“మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఈ అపారమైన బాధను భరించే శక్తిని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను” అని ముఖ్యమంత్రి అభిలాషించారు.
మృతదేహాలను మార్చురీకి పంపామని, మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని గంగ్వార్ తెలిపారు. ప్రభావిత ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
Read More
Next Story