
టీఎంసీ కార్యాలయాలపై బీజేపీ దాడులు
అయితే వారు తమ పార్టీ వారు కాదని పేర్కొన్న కమలదళం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన తరువాత టీఎంసీ కార్యాలయాల దగ్గర ఉన్న ప్లెక్సీలు, బోర్డులు ధ్వంసం అయినట్లు ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇందులో తమ కార్యకర్తల ప్రమేయం ఏమి లేదని పేర్కొంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు స్పష్టం కాగానే కొంతమంది బీజేపీ కార్యకర్తలు తమ కార్యాలయాల బయట గుమిగూడి దాడులకు పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. కూచ్ బీహార్, దక్షిణ 24 పరగణా, ఉత్తర పరగణ జిల్లాలోని కొన్ని కార్యాలయాలు ధ్వంసం అయినట్లు పేర్కొంది.
బారీపూర్ లోని ఉన్న పార్టీ కార్యాలయం ముందు ఉన్న టీఎంసీ చైర్ పర్సన్ మమతా బెనర్జీ, నేషనల్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఫొటోలు, ప్లెక్సీలు చించేసి, నేల మీద పడగొట్టారని స్థానిక నాయకుడు ఆరోపించారు.
ఈ ప్రాంతంలో ఉన్న జనాన్ని చెదరగొట్టి భారీ స్థాయిలో పోలీసులను మోహరించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని జామురియా ప్రాంతంలో టీఎంసీ ఆఫీస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అలాగే అసనోల్ ప్రాంతంలో ఉన్న టీఎంసీ కార్యాలయం సైతం బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి.
పానిహాటిలో టీఎంసీ ప్లెక్సీ బోర్డులు, జెండాలు తొలగించి వాటి స్థానంలో కాషాయ రంగు, కమలం చిహ్నాలు పెట్టారని టీఎంసీ ఆరోపణలు గుప్పించింది. అయితే దీనిలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని బీజేపీ ప్రకటించింది. గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఉత్తర 24 పరగణా జిల్లాలోని నౌవాపారా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఎంసీ అభ్యర్థి త్రినాంకుర్ భట్టాచార్య పై బీజేపీ మద్దతుదారులు దాడులు చేసినట్లు ఆరోపించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద బీజేపీ- టీఎంసీ కార్యకర్తలకు జరిగిన గొడవల్లో పలువురు అభ్యర్థులను కేంద్ర బలగాలు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి. శాంతి భద్రతలను కాపాడాలని ఏ పార్టీపైన గానీ, అభ్యర్థిపై గానీ దాడులు జరగకుండా నిరోధించాలని పోలీసులు, భద్రతా దళాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Next Story

