బీఎస్ఎఫ్ కు 142 ఎకరాల భూమి అప్పగించిన బెంగాల్ ప్రభుత్వం
x

బీఎస్ఎఫ్ కు 142 ఎకరాల భూమి అప్పగించిన బెంగాల్ ప్రభుత్వం

రెండు అంచెల వ్యూహం అనుసరించబోతున్నామని వెల్లడించిన సువేందు


Click the Play button to hear this message in audio format

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అవుట్‌పోస్టులు, కంచె మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్‌కు 142.79 ఎకరాల భూమిని అప్పగించిందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. సరిహద్దు కంచె, సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలంటూ మే 11న జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అప్పగింత జరిగింది.

"సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచేందుకు, బీఎస్ఎఫ్ అవుట్‌పోస్టులు, ముళ్లకంచె నిర్మాణాన్ని సులభతరం చేయడం ద్వారా సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పుడు అదనపు భూమిని బీఎస్ఎఫ్‌కు అప్పగించడంతో, మొత్తం భూమి 142.79 ఎకరాలకు చేరింది" అని ముఖ్యమంత్రి బుధవారం రాత్రి ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
తొమ్మిది జిల్లాల్లో బీఎస్ఎఫ్‌కు బదిలీ చేసిన భూమి వివరాలతో కూడిన జిల్లా వారీ చార్ట్‌ను కూడా ఆయన విడుదల చేశారు. చార్ట్ ప్రకారం, కూచ్‌బెహార్‌లో 22.92 ఎకరాలు, జల్‌పాయిగురిలో 35.16 ఎకరాలు, డార్జిలింగ్‌లో 8.81 ఎకరాలు, ఉత్తర దినాజ్‌పూర్‌లో 2.84 ఎకరాలు, దక్షిణ దినాజ్‌పూర్‌లో 20.17 ఎకరాల భూమిని అప్పగించారు.
అదనంగా, మాల్దాలో 10.9 ఎకరాలు, ముర్షిదాబాద్‌లో 38.8 ఎకరాలు, నాడియాలో 0.55 ఎకరాలు, ఉత్తర 24 పరగణాలలో 2.6 ఎకరాల భూమిని అప్పగించారు. ఈ కార్యక్రమం మొదటి దశలో భాగంగా, ఐదు జిల్లాల్లో కొనుగోలు చేసిన 43 ఎకరాల భూమిని, కేటాయించిన 31.9 ఎకరాల భూమికి సంబంధించిన మంజూరు ఉత్తర్వులను మే 20న బీఎస్ఎఫ్‌కు అప్పగించారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించకుండా చుట్టు కంచె వేయాలని కేంద్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. దానికి అవసరమైన భూమిని మాత్రం అప్పటి టీఎంసీ సర్కార్ కేటాయించలేదు. ప్రస్తుతం ఇక్కడ కొలువైన సువేందు సర్కార్ బీఎస్ఎఫ్ కు భూమిని అప్పగించింది.
ప్రస్తుతం రెండు అంచెల వ్యూహాన్ని ఇందుకోసం అనుసరించబోతున్నారు. భారత రాష్ట్రాలలోకెల్లా అత్యంత పొడవైన 2,217 కిలోమీటర్ల సరిహద్దును పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్‌తో పంచుకుంటుంది. సువేందు అధికారి ప్రకారం, రాష్ట్రంలోని సరిహద్దులో సుమారు 1,600 కిలోమీటర్ల మేర ఇప్పటికే కంచె వేయబడింది, కాగా దాదాపు 600 కిలోమీటర్ల మేర ఎలాంటి కంచె లేదు.
Read More
Next Story