‘కాగ్’ నివేదికలు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సువేందు సర్కార్
x
మమతా బెనర్జీ

‘కాగ్’ నివేదికలు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సువేందు సర్కార్

నాలుగేళ్లుగా కాగ్ నివేదికలను పట్టించుకోని మమతా బెనర్జీ సర్కార్, అనేక నిధులు దుర్వినియోగం చేసినట్లు బీజేపీ సర్కార్ విమర్శలు


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో శనివారం (జూలై 25) బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 28 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను ప్రవేశపెట్టింది. ఈ నివేదికల్లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణతో పాటు ఆరోగ్య బీమా పథకాలు, తుఫాను సహాయక చర్యలు, ఫ్లిప్‌కార్ట్‌కు భూ కేటాయింపులు, కోవిడ్ నిధుల వినియోగం వంటి అనేక అంశాల్లో జరిగిన లోపాలను ప్రస్తావించింది.

గత టీఎంసీ ప్రభుత్వం 2020-21 నుంచి 2024-25 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా తెలిపారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం వాటిని సభ ముందుకు తీసుకొచ్చిందని చెప్పారు. ఈ నివేదికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. ప్రజల ముందు ప్రభుత్వ లోపాలను ఉంచడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం, 2015-16 నుంచి 2024-25 వరకు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) వార్షిక సగటు 9.57 శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, అదే కాలంలో రాష్ట్రం నిరంతరం రెవెన్యూ లోటును ఎదుర్కొంది. రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా రుణభారం ఉండటానికి గల కారణాలపై కూడా నివేదికలు వివరణ ఇచ్చాయి.
2024-25 బడ్జెట్‌లో రూ.3.90 లక్షల కోట్ల కేటాయింపులో రూ.3.19 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, రూ.70,662 కోట్ల నిధులు వినియోగం కాకుండా మిగిలిపోయాయని కాగ్ తెలిపింది. అలాగే అదనపు వ్యయాలకు శాసనపరమైన ఆమోదం అవసరమని సూచించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిన నిధుల్లో కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా మిగిలిపోయినట్లు పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్ సంస్థ ఇన్‌స్టాకార్ట్‌కు హరింఘాట ఇండస్ట్రియల్ పార్క్‌లో భూమి కేటాయింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.12.86 కోట్ల నష్టం జరిగిందని మరో కాగ్ నివేదిక వెల్లడించింది. భూమి ధర నిర్ణయంలో డబ్ల్యూబీఐడీసీఎల్ తన సొంత ధరల విధానాన్ని పాటించకపోవడంతో ఈ నష్టం సంభవించిందని పేర్కొంది. అయితే అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా, కాగ్ దానిని అంగీకరించలేదు.
టీఎంసీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'స్వస్థ్య సాథీ' ఆరోగ్య బీమా పథకం అమలులో కూడా పలు లోపాలను కాగ్ గుర్తించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు అధిక చెల్లింపులు, లబ్ధిదారుల నమోదులో అవకతవకలు, ఫిర్యాదుల పరిష్కారంలో బలహీనత, బీమా సంస్థలపై ఒప్పంద నిబంధనలు అమలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. అర్హత కంటే ఎక్కువ గ్రేడ్‌లు ఇవ్వడం వల్ల రూ.14.48 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని తెలిపింది. అలాగే బీమా సంస్థలు తిరిగి చెల్లించాల్సిన రూ.29.78 కోట్లను రాష్ట్ర నోడల్ ఏజెన్సీకి చెల్లించలేదని పేర్కొంది.
కోవిడ్ సమయంలో పీఎం కేర్స్, సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లలో సగానికి పైగా 2023 డిసెంబర్ నాటికీ పనిచేయలేదని మరో నివేదిక వెల్లడించింది. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్-2 కింద విడుదలైన నిధుల్లో గణనీయమైన మొత్తం ఖర్చు కాకుండా మిగిలిపోయిందని కూడా కాగ్ పేర్కొంది.
అసెంబ్లీలో నివేదికలు ప్రవేశపెట్టిన సందర్భంగా స్వపన్ దాస్‌గుప్తా, కాగ్ నివేదికలను ఇంతకాలం సభ ముందుకు తీసుకురాకపోవడం రాజ్యాంగపరమైన లోపమని వ్యాఖ్యానించారు. నివేదికల్లో అవినీతికి సంబంధించిన అంశాలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
Read More
Next Story