
అయోధ్య రామమందిరం
రామమందిర విరాళాల వివాదంపై జూలై 20న విచారణ
కేసుల విచారణ జాబితాను విడుదల చేసిన సుప్రీంకోర్టు
అయోధ్య రామమందిరంలో విరాళాలను దోచుకున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరతూ దాఖలైన పిటిషన్లపై జూలై 20 విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది. జూలై 20 నాటి సుప్రీంకోర్టు కేసుల జాబితా ప్రకారం, ఈ అంశానికి సంబంధించిన నాలుగు వేర్వేరు పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.
జూలై 13న.. ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించి, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) తమకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయంలో స్పందన కోరుతూ ధర్మాసనం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు కూడా నోటీసు జారీ చేసింది.
"ఇప్పటికే కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయని, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసినట్లు కొన్ని రిట్ పిటిషన్లలో పేర్కొన్నందున, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కోర్టుకు ఒక స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని మేము ఆదేశిస్తున్నాము" అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ కేసులోని పిటిషనర్లలో ఒకరైన నరేంద్ర కుమార్ గోస్వామి, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామమందిర వ్యవహారాలను నిర్వహించే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ చేయాలని కూడా ఆయన కోరారు.
సుప్రీంకోర్టులో పిటిషన్లలో ఒకదాన్ని దాఖలు చేసిన అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్, ఆలయ ట్రస్ట్ వ్యవహారాలు, పరిపాలనకు సంబంధించిన ఆరోపిత ఆర్థిక అవకతవకలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సిబిఐ నేతృత్వంలోని బహుళ-విభాగాల సిట్ దర్యాప్తు చేయాలని కోరారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కోరడంతో పాటు, ట్రస్ట్ మొత్తం ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన మూడవ పిటిషన్లో కోరారు. 'హిందూ ధర్మ పరిషత్' దాఖలు చేసిన మరో పిటిషన్, ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరింది.
రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు జూన్ 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ (SIT)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక) నీల్ రతన్ ఉన్నారు.
Next Story

