
ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్య వివాదంపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదు: కాంగ్రెస్
కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న జైరాం రమేష్
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ప్రధాని మంత్రి ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ మౌనం కోట్లాదిమంది భక్తుల విశ్వాసంపై ప్రత్యక్ష దాడి అని ఆరోపించింది.
ప్రార్థనలు చేసి, శ్రీరాముని ఆశీస్సులు కోరేందుకు తమ ప్రతినిధి బృందం మంగళవారం అయోధ్యను సందర్శించాల్సి ఉండగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ను పోలీసులు 'అరెస్ట్' చేశారని కూడా ఆ ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.
'మోదీ జీ, మీ మౌనం వీడండి'
ప్రధాని మౌనం వీడాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు, "శ్రీరామ మందిరంలో జరిగిన దోపిడీపై ప్రధాని మోదీ మౌనం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మత విశ్వాసంపై ప్రత్యక్ష దాడి. మోదీ ప్రభుత్వం ఎలాంటి పారదర్శక ప్రమాణాలు లేదా ప్రజా సంప్రదింపులు లేకుండా (శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర) ట్రస్ట్ను ఏర్పాటు చేసి, దానికి ఆర్ఎస్ఎస్ సభ్యులను నియమించింది. తదనంతరం, మొత్తం ట్రస్ట్కు ఆర్టిఐ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చింది. మోదీ జీ, మీ మౌనం వీడండి" అని రమేష్ అన్నారు.
తాను అయోధ్యకు చేరుకున్న వెంటనే, "భయానికి లోనైన" బిజెపి ప్రభుత్వం, తన హోటల్లో పోలీసులతో "అరెస్ట్" చేయించి, వాహనంలో తీసుకువెళ్లిందని రాయ్ తన పోస్ట్లో ఆరోపించిన దానికి ప్రతిస్పందనగా రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది! శ్రీరాముని ఆశీస్సులు కోరుతూ, ప్రార్థనలు చేయడానికి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఒకటి రేపు, జూన్ 30న అయోధ్యను సందర్శించాల్సి ఉంది. నేను అయోధ్యకు చేరుకోగానే, భయానికి లోనైన బీజేపీ ప్రభుత్వం, నా హోటల్లోనే పోలీసులతో నన్ను అరెస్టు చేయించి, జీపులో తీసుకువెళుతోంది," అని రాయ్ అన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు..
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రామ మందిరంలో విరాళాల దుర్వినియోగంపై ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో, అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం (జూన్ 29) నాడు, అరెస్టు అయిన ఎనిమిది మంది నిందితులకు తమ సభ్యులెవరూ ప్రాతినిధ్యం వహించరని ప్రకటించింది. సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తామని కూడా తెలిపింది.
సుప్రీంకోర్టులో, జస్టిస్లు ఎంఎం సుందరేష్ షీల్ నాగు రామ మందిర విరాళాల అవకతవకలపై దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించారు. ఈ విషయాన్ని వేసవి విరామం తర్వాత విచారణకు జాబితా చేస్తామని తెలిపారు. కోర్టు జూలై 13న తిరిగి తెరుచుకుంటుంది.
బీజేపీకి ఓటు వేయవద్దు: అఖిలేష్ యాదవ్..
రామ మందిర నిర్మాణాన్ని తమ ప్రధాన విజయాలలో ఒకటిగా పేర్కొన్న బీజేపీపై ప్రతిపక్షాలు తమ దాడిని తీవ్రతరం చేశాయి. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీజేపీ "శ్రీరామునికి ద్రోహం చేసిందని" ఆరోపిస్తూ, "నిజమైన సనాతనులు" బీజేపీకి ఓటు వేయవద్దని లేదా ఆ పార్టీ నుంచి ఎన్నికల టిక్కెట్లు కోరవద్దని పిలుపునిచ్చారు.
మరోవైపు బీజేపీ, న్యాయవాదుల బహిష్కరణ చర్యను "హిందూ సమాజం నుంచి వచ్చిన శక్తివంతమైన సందేశం"గా అభివర్ణించింది. అయోధ్యలో దోపిడీకి పాల్పడిన నిందితులు చట్టం పూర్తి బలాన్ని మాత్రమే కాకుండా సామాజిక బహిష్కరణను కూడా ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసింది. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా స్పష్టంగా చెప్పారని, ఈ కేసు చట్ట ప్రకారం ముందుకు సాగుతుందని పార్టీ పేర్కొంది.
ఎనిమిది మంది అరెస్టు..
విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు జూన్ 13న యూపీ ప్రభుత్వం సిట్ (SIT)ను ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక ఆధారంగా, అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ అలియాస్ తిను యాదవ్ అనే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కేవలం చిన్న వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, ప్రధాన దోషులు ఇంకా స్వేచ్ఛగానే ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
Next Story

