ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరామ్?
టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి

ప్రొఫెసర్ కోదండరామ్
టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రె స్తో టీజేఎస్ పొత్తు పెట్టుకునేలా చేశారు. పోటీ చేయనందుకు బహుమతి..
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్ ప్రకటించడంతో టీజేఎ్సకు సీట్లు కేటాయించలేదు. కానీ.. ఇరు పార్టీల మధ్య మైత్రీ బంధం కొనసాగింది. కోదండరామ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు. బుధవారం సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబరాల్లో పాల్గొని, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి.
మరికొందరు మేధావులకూ చాన్స్
రేవంత్ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కోదండరామ్కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం.
రాజీవ్ శర్మకూ చాన్స్
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ కార్యకలాపాల్లో సహకరించిన రాజీవ్ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి మాజీ సీఎం కేసీఆర్ రప్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఐఏఎస్గా రిటైర్ అయిన తర్వాత శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉన్నారు. ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ పోస్టులో కోదండరామ్ను నియమిస్తారని సమాచారం. ఆయనకు రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్ కావడానికి దోహదపడుతుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది.
Next Story


