
అకోలాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
సోమవారం 47 డిగ్రీలకు చేరిన ఎండ వేడీ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
మహారాష్ట్ర సోమవారం నిప్పుల కొలిమిలా మారింది. ముఖ్యంగా విదర్భ ప్రాంతం మొత్తం వడగాలుల తాకిడితో అల్లాడింది. అకోలా లో దేశంలోనే అత్యధికంగా 46.9°C ఉష్ణోగ్రత నమోదయింది. నాగ్పూర్, విదర్భలోని పలు ఇతర ప్రాంతాలు తీవ్రమైన వడగాలుల బారిన పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని విదర్భ ప్రాంతంలోని కొన్ని భాగాలలో మంగళవారం వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్కు చేరవచ్చని, అక్కడక్కడా 47 డిగ్రీల సెల్సియస్కు చేరవచ్చని ఐఎండీ తెలిపింది.
నాగ్పూర్లోని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసి) ప్రకారం, ఆదివారం దేశంలోనే అత్యధికంగా అకోలాలో 46.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత అమరావతిలో 46.8 డిగ్రీల సెల్సియస్ గా తయారైంది.
గణాంకాల ప్రకారం, వార్ధాలో 46.4, యవత్మాల్లో 46, నాగ్పూర్లో 45.4, చంద్రాపూర్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, చంద్రాపూర్, నాగ్పూర్లలో వడగాలుల పరిస్థితులు నెలకొనగా, అనేక ఇతర జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్ఎంసి శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ జాతీయ మీడియాకు తెలిపారు.
మహారాష్ట్ర, దాని ఆనుకోని ప్రాంతాలపై ఏర్పడిన ప్రతిచక్రవాత ప్రసరణ కారణంగా విదర్భలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అదే సమయంలో, వేడి, పొడి వాయువ్య గాలులు ఈ ప్రాంతాన్ని నిరంతరం ప్రభావితం చేస్తున్నాయని ఆయన అన్నారు.
దీనికి తోడు, బలహీనమైన పశ్చిమ పవనాలు, తేమ ప్రవేశం లేదా ఏవైనా ముఖ్యమైన వాతావరణ వ్యవస్థలు లేకపోవడం వంటివి ఈ ప్రాంతంలో వేడి తీవ్రతకు దోహదపడ్డాయని ఆ అధికారి తెలిపారు.
వాతావరణ శాఖ ప్రకారం, ఈ ప్రాంతంలోని కొన్ని లేదా అక్కడక్కడా మంగళవారం వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్కు, అక్కడక్కడా 47 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంటూ, అకోలా, అమరావతి, వార్ధాలకు 'ఆరెంజ్' హెచ్చరికను, నాగ్పూర్, చంద్రాపూర్, యవత్మాల్కు 'పసుపు' హెచ్చరికను ఐఎమ్డి జారీ చేసింది.
ఆ తర్వాత వడగాలుల నుంచి ఉపశమనం లభించి, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Next Story

