
టీటీవీ దినకరన్
‘దినకరన్’ ను పార్టీకి తీసుకురావడం కుదరదు: పళిని స్వామి
కార్యకర్తల అభిప్రాయాలను సున్నితంగా తిరస్కరించిన మాజీ సీఎం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన టీటీవీ దినకరన్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవడం కుదరదని ప్రస్తుత కార్యదర్శి పళని స్వామి తేల్చి చెప్పారు.
దినకరన్ తన సొంత పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. పార్టీ బలాన్ని, నిర్మాణాన్ని సమీక్షించేందుకు నేటి నుంచి పది జిల్లాల కార్యవర్గ సభ్యులలతో కీలక సమావేశాన్ని ప్రారంభించిన పళనిస్వామికి ఆరంభంలోనే కార్యకర్తలు కొన్ని సూచనలు చేశారు. మొదట పార్టీ నుంచి 2017 లో బహిష్కరించిన టీటీవీ దినకరన్ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కోరారు. అయితే పళని స్వామి దీనిని సున్నితంగా తిరస్కరించారు.
టీటీవీ దినకరన్ సంవత్సరం తరువాత అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం స్థాపించారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు గట్టి మద్దతుగా నిలిచారు.
అన్నాడీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తంజావూర్, శివగంగ జిల్లాల కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పళని స్వామి, టీటీవీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తన సొంత రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని రెండు పార్టీల విలీనం సంక్లిష్టంగా ఉంటుందని పళని స్వామి పేర్కొన్నారు.
‘‘కావేరీ డెల్టా ప్రాంతంలో దక్షిణ జిల్లాలలో అన్నాడీఎంకేను బలోపేతం చేసేందుకు దినకరన్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని మాలో చాలామంది మా ప్రధాన కార్యదర్శికి చెప్పాము’’ అని తంజావుర్ కు చెందిన ఓ కార్యకర్త విలేకరులతో అన్నారు.
పలువురు అన్నాడీఎంకే మాజీ మంత్రులు, శాసన సభ్యులు, పార్టీని వీడి అధికార తమిళగ వెట్రి కజగంలో చేరిన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పళని స్వామి జూలై 9 వరకూ తిరుపత్తూర్ రాణిపేట, తిరువళ్లూర్, ధర్మపురి, కృష్ణగిరి,ఈ రోడ్, వెల్లూర్, తిరుచిరాపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
Next Story

