కేరళ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఘర్షణ
x

కేరళ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఘర్షణ

50 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కేసు నమోదు


Click the Play button to hear this message in audio format

కేరళ యూనివర్శిటీ యూనియన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తిరువనంతపురంలో ఘర్షణలు చెలరేగాయని, ఎన్నికలలో ఘన విజయం సాధించిన వామపక్ష విద్యార్థి సంఘం నిర్వహించిన విజయ యాత్రపై కేఎస్‌యూ కార్యకర్తలు దాడి చేశారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించినట్లు పోలీసులు మంగళవారం (మే 26) తెలిపారు.

సోమవారం రాత్రి యూనివర్శిటీ ప్రాంతం సమీపంలో ఎస్ఎఫ్ఐ విజయ యాత్ర సందర్భంగా ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఎస్ఎఫ్ఐ నాయకుల ప్రకారం, కేఎస్‌యూ కార్యకర్తలు ఊరేగింపుపై రాళ్లు విసిరి, ఒక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

అయితే ఈ వాదనను పోలీసులు ఖండించారు. పరాజయం పాలైన కేఎస్ యూ కార్యకర్తలపైనే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేశారని, దీనితో వారు కూడా ఎదురుదాడికి దిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయగా, మరో 40 మందిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. వారందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడిలో ఒక ఎస్ హెచ్ఓ మోచేతి వద్ద ఎడమ చేయి ఎముక విరిగిందని, ఇతర పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని ఆరోపించారు. వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
ఉద్రిక్తతలు పెరిగి, ఘర్షణలు వీధుల్లోకి వ్యాపించడంతో, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ఉపయోగించి, లాఠీచార్జి చేశారు. సీపీఐ(ఎం) విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), కేరళ యూనివర్సిటీ యూనియన్‌లోని 37 స్థానాలకు గాను 35 స్థానాలను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.
కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) ఈ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత సంబరాలు క్యాంపస్ బయటకు వ్యాపించి ఉద్రిక్తంగా మారడంతో, ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్షణల అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న రాజ్యసభ ఎంపీ, డీవైఎఫ్ఐ నాయకుడు ఏఏ రహీం, ఎస్ఎఫ్ఐ ఊరేగింపు శాంతియుతంగా ముగిసి, మీడియా సిబ్బంది ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన తర్వాత కేఎస్‌యూ కార్యకర్తలు "ముందే ప్రణాళికతో కూడిన దాడి" చేశారని ఆరోపించారు.
రాళ్ల దాడిలో మహిళా కార్యకర్తలతో సహా పలువురు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, రోడ్డుపై ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నిరసనకారులపై అధికారులు బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ, రహీమ్ పోలీసుల చర్యను కూడా విమర్శించారు.
నిరసనకారులను చెదరగొట్టాడానికి పోలీసులు అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వెళ్ళడానికి నిరాకరించారని పోలీసులు తెలిపారు. దీంతో వారిపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాళ్లు రువ్వి పోలీసు వాహనం ముందు విండ్‌స్క్రీన్‌ను ధ్వంసం చేశారని, దీనివల్ల కేరళ ప్రభుత్వానికి సుమారు రూ. 30,000 నష్టం వాటిల్లిందని పోలీసులు ఆరోపించారు. నిరసనకారులు రోడ్డును దిగ్బంధించడంతో, వారిని చెదరగొట్టడానికి "అవసరమైన బలప్రయోగంతో" లాఠీచార్జి చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు పోలీసు సిబ్బందిని వారి చట్టబద్ధమైన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, రాత్రి 11.30 గంటల వరకు నిరసనను కొనసాగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. నిరసనకారులు తమ వద్ద ఉన్న రాళ్లు, కర్ర ముక్కలతో పోలీసు అధికారులపై దాడి చేశారని, ఒకే ఉద్దేశంతో ఏకమై నేరాలకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు.
Read More
Next Story