
రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శకి అందజేస్తున్న సిద్ధరామయ్య
ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
రాజ్యసభ సీటును తిరస్కరించానని వెల్లడి
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేశారు. దీనితో చాలాకాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెరదించినట్లు అయింది. ఎన్నికల సమయంలోనే సీఎం పదవిని ఆశించిన ఆయన డిప్యూటీ, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఇక మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది.
సిద్దరామయ్య బెంగళూర్ లోని లోక్ భవన్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ తన సొంత పనుల మీద మధ్యప్రదేశ్ వెళ్లడంతో స్వయంగా లేఖను అందజేయలేకపోయారు. గవర్నర్ కార్యదర్శి ఆర్ ప్రభుశంకర్ కు ఆయన రాజీనామా లేఖను అందించారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ విందులో తన సహచరులకు ఆయన తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే విషయం తెలియడంతో మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు.
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తాను దాదాపు 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 1978 లో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పారు. తన రాజకీయా లక్ష్యాలు, సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడలేదని చెప్పుకొచ్చారు. తనపై ప్రతిపక్షం ఎన్నో తప్పుడు కథనాలు తీసుకొచ్చిందని, వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాననని పేర్కొన్నారు.
తన జీవితం తెరిచిని పుస్తకం అని, ఆస్తుల కూడబెట్టాలని,డబ్బులు సంపాదించాలనే లక్ష్యం పెట్టుకోలేదని చెప్పారు. తన చివరి శ్వాస వరకూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని వెల్లడించారు. తనను జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సోనియాగాంధే తీసుకొచ్చారని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వల్లే నేను చదువుకుని రాజకీయ నాయకుడిని అయ్యాయని, తరువాత లభించిన ఉప ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి అందాయని పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
Next Story

