500ఏళ్ల క్రితమే బోనాలున్నాయ్..
x

500ఏళ్ల క్రితమే బోనాలున్నాయ్..

బోనాల పండుగను వాస్తవానికి 1516 ఏడీ నాటికే కొనసాగుతున్నదని ఏఎస్‌ఐ తేల్చింది.


తెలంగాణ సంస్కృతి చరిత్రను తిరిగి రాసేలా భారత పురావస్తు శాఖ (ASI) ఒక కీలక ఆవిష్కరణ చేసింది. ఇప్పటివరకు 19వ శతాబ్దంలో ప్లేగు కాలంలో ప్రారంభమైందని భావించబడిన బోనాల పండుగ, వాస్తవానికి 1516 ఏడీ నాటికే కొనసాగుతున్నదని ఏఎస్‌ఐ తేల్చింది. ఈ పరిశోధనతో బోనాల చరిత్ర కనీసం మూడు శతాబ్దాలు వెనక్కి వెళ్లింది.

300 ఏళ్లనాటి ఆధారం

ఏఎస్‌ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె. మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో బోనాల పండుగకు సంబంధించిన అత్యంత పురాతన ఆధారం ఒక తెలుగు శాసనం రూపంలో లభించింది. ఈ శాసనం 1516 మే 4 (ఆదివారం) తేదీకి చెందినది. ఇది నేటి హైదరాబాద్–కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన గోబ్బూర్ నుంచి లభించగా, ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. “తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ఇప్పటివరకు లభించిన అత్యంత పురాతన శాసన ఆధారం ఇదే” అని మునిరత్నం రెడ్డి తెలిపారు.

పన్ను మినహాయింపులు

ఈ శాసనంలో బోనాలు, రంగం (భవిష్యవాణి), కునముగ్గు, గడ్డపట్టణం, పట్టణం వంటి ప్రజా ఆచారాలపై ప్రభుత్వం విధించే పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొనబడింది. అంతేకాదు, కొండపల్లి వద్ద దేవత సన్నిధిలో బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి, రాయసం కొండమరసయ్య ఆదేశాల మేరకు పెద్ద చెరువు, బొల్లసముద్రం చెరువుల కింద ఉన్న భూములను ‘సర్వమాన్యం’గా దానం చేసినట్లు కూడా ఈ శాసనం నమోదు చేసింది.

అదే శాసనంలో విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్వతయ్య ఈ స్తంభాన్ని స్థాపించాడని పేర్కొబడింది. దాంతో పాటు ఈ ఆచారాలు, ఉత్సవాలు అప్పటికే చాలా కాలం నుంచి జరుగుతున్నాయని కూడా నమోదయి ఉంది.

ప్లేగుకు ముందే బోనాలు

ఇప్పటివరకు బోనాల పండుగ మూలాలు 19వ శతాబ్ద ప్రారంభంలో ఉన్నట్లే ప్రాచుర్యమైంది. ఈ పండగ మూలాలు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలను కుదిపేసిన ప్లేగు మహమ్మారితో ముడిపడి ఉన్నాయనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఆ కాలంలో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహాకాళీ దేవిని ప్రార్థించి, ప్లేగు తగ్గితే బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారనే కథనం ప్రజల్లో ప్రాచుర్యంలో ఉంది. అయితే, తాజాగా లభించిన ఈ శాసన ఆధారాలు బోనాల చరిత్రను ప్లేగు కాలానికి నుంచి మూడు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్లాయి. దీంతో ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలు మారుతున్నాయి.

ఐదు శతాబ్దాల సంప్రదాయం

బోనాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ఆషాఢ మాసంలో (జూలై–ఆగస్టు) హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మహాకాళీ దేవికి అంకితంగా ఈ జానపద పండుగను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా దేవికి ప్రత్యేక వంటకాలు సమర్పిస్తారు. “శాసనంలో ప్రస్తావించిన బోనాలు, రంగం, కునముగ్గు, పట్టణం వంటి ఆచారాలు ఇప్పటికీ తెలంగాణ జానపద సంస్కృతిలో కొనసాగుతుండటం విశేషం” అని మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు.

సంస్కృతి, చరిత్రకు కొత్త దిశ

ఈ ఏఎస్‌ఐ పరిశోధనతో బోనాల పండుగకు విజయనగర కాలం నాటి చారిత్రక గుర్తింపు లభించింది. ఇది బోనాలను కేవలం ఇటీవలి సంప్రదాయంగా కాకుండా, ఐదు శతాబ్దాలుగా కొనసాగుతున్న జీవంత సాంస్కృతిక వారసత్వంగా నిలబెడుతోంది. తెలంగాణ ప్రజల విశ్వాసం, జానపద సంప్రదాయాల నిరంతరతకు ఇది శక్తివంతమైన చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది.

కృష్ణదేవరాయల కాలంలోనే బోనాలు : శ్రీరామోజు హరగోపాల్

బోనాల పండగ చరిత్ర గురించి ‘ది ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాలు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. బోనాలు అనేది ప్లేగు తర్వాత వచ్చిన సంప్రదాయం కాదని ఆయన చెప్పారు. కృష్ణదేవరాయలు కాలం నుంచే బోనాలు పండగ సాంప్రదాయం ఉందని తెలిపారు. అంతకుముందు కూడా బోనాలు జరుపుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 1516 మే 4న స్తాపించిన శాసన స్తంభం కూడా ఇదే విషయాలను స్పష్టం చేస్తుందని, ఆ శాసన స్తంభం కృష్ణదేవరాయల కాలం నాటిదని వివరించారు.

ప్రాంతీయ పండగలకు ఆధారాలు కష్టం

‘‘బోనాలు అనేది ప్రాంతీయ పండగా కొనసాగుతుంది. ఇలాంటి ప్రాంతీయ పండగలకు సంబంధించి అధికారిక సాక్ష్యాలు, ఆధారాలు లభించడం కష్టం. మాకు కాటమయ్య శిల్పం లభించిన సమయంలో కూడా అందులో ఒక ఆడమనిషి తలపై కుండ ఎత్తుకుని ఉన్న బొమ్మలను మేము గమణించాం. మాకు దొరికిన మరికొన్ని ఆధారాల ప్రకారం 9-10 శతాబ్దాల కాలంలోనే బోనాలు పండగ ఉంది. గ్రామాల్లో చేసుకునే పండగల్లో రికార్డ్స్‌లో ఉన్నవి, చరిత్రలో శాసనాలుగా, శిలాఫలాకల రూపంలో ఉన్నవి చాలా తక్కువ’’ అని హరగోపాల్ వివరించారు. అంతేకాకుండా బోనం అంటే ఆహారమేనని, దేవునికి పెట్టే నైవేథ్యాన్ని ఇంట్లో వండుకుని మట్టి కుండల్లో ఆలయానికి తీసుకుని వెళ్లి దేవతకు సమర్పించుకుంటారని వివరించారు. బోనం అనేది తెలంగాణ పేరు అని, అది కాలక్రమేణా అది తెలుగువారి పదంగా మారిందని వివరించారు శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.

Read More
Next Story