
కాలేజి యాజమాన్యాలకు రేవంత్ వార్నింగ్
డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా
తమాషాలు చేస్తే తాట తీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేట్ కళాశాలలకు వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రయివేటు కాలేజీలపై మండి పడ్డారు. విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం. నిధుల కోసం కాలేజీలను మూసివేస్తామనే పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ప్రయివేటు కాలేజీలకు రు. 9000 కోట్లు బకాయీ ఉందని ఫాతి ( FATHI) చెబుతున్నది. కానీ బకాయి ఉన్నది కేవలం రు. 3,600 కోట్లు మాత్రమే. ఇందులో రు. 2,600 కోట్లు కెసిఆర్ కాలంలో పేరుకు పోయిన బకాయి అని రేవంత్ రెడ్డి చెప్పారు.
“అరోరా విద్యాసంస్థల యాజమాని రమేష్ 12 కాలేజీలకు అనుమతులు అడిగాడు. మహబూబ్నగర్లో ఉన్న కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ (Off-campus) కోసం జయప్రకాష్ అనుమతి కోరాడు. నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అనుమతులు ఇవ్వలేదు. ఎవరెవరు క్యాంపస్ లు అడిగారో నా దగ్గర జాబితా ఉంది, అవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా,”అని రేవంత్ ప్రశ్నించారు.
‘‘కాలేజీ యాజమాన్యాలు వచ్చే ఏడాది ఎట్ల డొనేషన్లు వసూలు చేస్తయో నేనూ చూస్త. ప్రభుత్వం చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంది. విద్య వ్యాపారం కాదు.. సేవ! లాభాలు ఆర్జించేందుకు విద్యను వ్యాపారం చేసేందుందుకు తెలివితేటలు ప్రదర్శిస్తామంటే కుదరదు. వఅడిగిన అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా?’’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
“2014 నుంచి ఇప్పటి దాకా ఫీరీఇంబర్స్ మెంట్ పథకం కింద చదువుకున్న విద్యార్థులు ఎవరు? ఎవరెవరికి బకాయి ఉందన్న దాని పైన సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేయాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పైన 2014-15 సంవత్సరంలో కేసీఆర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నారే కానీ సేవ చేయట్లేదు,”అని ముఖ్యమంత్రి అన్నారు.
తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించి మాట్లాడుతుూ, జూబ్లి హిల్స్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎన్నో ప్రాజెక్టులు వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ లా మారిందని రేవంత్ అన్నారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూల్చేసిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కిందన్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ తెలంగాణను సర్వనాశనం చేసిందన్నారు.


