
క్యూర్ బిల్లు ....ప్రజల జేబుకి చిల్లు!
హైదరాబాద్ నగర పాలనలో మార్పులు తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఏడు దశాబ్దాలుగా అమలులో ఉన్న జిహెచ్ఎం సి చట్టం-1955 స్థానంలో ‘క్యూర్ బిల్, 2026’(కోర్ అర్బన్ రీజియన్ బిల్) ని తీసుకురాబోతుంది.ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుని ప్రజల ముందుంచి,జూలై 24 వరకూ ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్టు మున్సిపల్ పరిపాలన,పట్టాణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ చట్టం 1955 లో రూపొందించారని, గత 70 ఏళ్లలో హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందడంతో ఆ చట్టంలోని అనేక నిబంధనలుప్రస్తుత కాలానికి, వేగంగా విస్తరిస్తున్న నగర జనాభా అవసరాలకు సరిపోకపోవడం వల్లే ఈ కొత్త బిల్లు అవసరమని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అయితే, ఈ బిల్లులో 'క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్' ఏర్పాటు కొంత చర్చకి దారి తీస్తోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతనే నడిచే ఈ కౌన్సిల్ చేతుల్లోనే నగరానికి సంబంధించిన సర్వాధికారాలు, కీలక నిర్ణయాలు కేంద్రీకృతం అవుతాయి. దీనివల్ల స్థానికంగా ఎన్నుకోబడే మేయర్, కార్పొరేటర్ల పాత్ర నామమాత్రంగా మారి, నగర పాలన పూర్తిగా బ్యూరోక్రసీ,సీఎంఓ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ బిల్లులోని ముఖ్య అంశాలు ఏంటి? ప్రస్తుతం ఉన్న జి హెచ్ ఎం సి -1955 బిల్లు కన్నా ఇది హైదరాబాద్ వాసులకు ఎలా మేలు చేస్తుంది? అధికారాల కేంద్రీకరణతో స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందా?

