
డీఎంకేకు తగ్గబోతున్న ఓట్ల శాతం వల్ల ఎవరికి లాభం?
అన్నాడీఎంకేకు మళ్లాయా? దళపతి ఖాతాలో పడ్డాయా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడుదల అయిన చాలా ఎగ్జిట్ పోల్స్ అధికార డీఎంకేనే తిరిగి పీఠం అధిరోహిస్తుందని అంచనా వేశాయి. అయితే క్రితం సారి సాధించిన ఓటింగ్ శాతాన్ని అధికార డీఎంకే కూటమి సాధించలేకపోవచ్చని కూడా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ తేడా దాదాపు ఎనిమిది శాతం వరకూ ఉండవచ్చని పేర్కొన్నాయి. అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికల ధోరణులను మార్చివేయగలదని ఎన్నికల వ్యూహకర్త ఎం. స్టాలిన్ అంటున్నారు.
ముఖ్యంగా టీవీకే వంటి కొత్త పార్టీల ప్రవేశంతో మారుతున్న ఓటర్ల ప్రవర్తనను సర్వేలు పూర్తిగా పట్టుకోగలిగాయా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, ఓట్ల మార్పులు, పార్టీ వ్యూహాలు, అంచనాలు తరచుగా ఎందుకు తప్పుగా ఉంటాయనే విషయాలపై 'ది ఫెడరల్' వ్యూహకర్త ఎం. స్టాలిన్తో మాట్లాడింది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై మీ అంచనా ఏమిటి?
నేను అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలించాను. వాటిలో చాలా వరకు ప్రస్తుత ప్రభుత్వమైన డీఎంకే కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కానీ మనం చారిత్రక సరళిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అంటే అది 1996 నుంచి 2001 వరకు అయినా లేదా 2006 నుంచి 2011 వరకు అయినా సరే ఎప్పుడైతే అధికార పార్టీగా ఎన్నికలను ఎదుర్కొందో, వారి ఓట్ల వాటాలో తగ్గుదల కనిపించింది. కొన్ని సందర్భాల్లో ఇది దాదాపు 10 శాతంగా ఉంది. సగటున వారి గత పనితీరుతో పోలిస్తే ప్రస్తుతం 8 శాతం తగ్గుదల ఉంది.
ఇది మనం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ ఎనిమిది శాతం కూడా స్థిరంగా ఉండదు. అది స్వింగ్ ఓట్లుగా మారి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఆ పార్టీకే వెళ్తుంది. కాబట్టి మనం దానిని “డీఎంకే ఓట్లు” అని పిలవలేము. అవి ప్రాథమికంగా అధికార వ్యతిరేక ఓట్లు.
టీవీకే వంటి కొత్త పార్టీలు బరిలోకి దిగినప్పుడు, ఈ అధికార వ్యతిరేక ఓట్లు ఎక్కడికి వెళ్తాయి?
గత చరిత్రను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ ఓట్లు ఏఐఏడీఎంకేకే వెళ్లాయి. కానీ విజయ్ స్థాపించిన టీవీకే వంటి కొత్త పార్టీ బరిలోకి దిగినప్పుడూ ఈ అధికార వ్యతిరేక ఓట్లలో కొంత భాగం దారి మళ్లుతుంది. కాబట్టి టీవీకేకు వచ్చే ఓట్లు పూర్తిగా దాని సొంతం కాదు.
అవి లేకపోతే ఏఐఏడీఎంకే లేదా డీఎంకేకు వెళ్లాల్సిన అధికార వ్యతిరేక సెంటిమెంట్ల నుంచి వచ్చినవి. 1996 నుంచి చూస్తే ఎండీఎంకే, పీఎంకే వంటి కొత్త పార్టీలను చూస్తున్నాం. సాధారణంగా, వారు సుమారు 8–12 శాతం ఓట్లను పొందుతారు.
విజయ్ తనకున్న ప్రజాదరణ దృష్ట్యా ఆ శాతాన్ని క్రాస్ చేయగలుగుతాడు. అయితే, 2024లో సుమారు 8 శాతం ఓట్ల వాటాను కలిగి ఉన్న NTK వంటి పార్టీలను ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని నేను భావిస్తున్నాను. ఈ ఓట్లు సైద్ధాంతికమైనవి. తమిళ గుర్తింపుతో పాటు సీమాన్ ఆకర్షణలో పాతుకుపోయినవి. కాబట్టి అవి వాటంతట అవే TVKకి మారకపోవచ్చు.
మీ క్షేత్రస్థాయి సర్వేల ఆధారంగా, ఈ ఎన్నికలలో టీవీకే అవకాశాలు ఎలా ఉన్నాయి?
టీవీకేపై అభిప్రాయం దశలవారీగా మారుతూ వచ్చింది. విజయ్ తన పార్టీని మొదట ప్రకటించినప్పుడు, అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అతని తొలి ప్రచార కార్యక్రమాలు, కరూర్ ఘటనతో సహా తదనంతర పరిణామాల తర్వాత ప్రజలకు ఆయనపై అభిప్రాయం మారింది.
ఏఐఏడీఎంకే క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా మారినందువల్ల టీవీకే ఓట్ల వాటా తగ్గుతుందేమోనని భావించారు. అంతకుముందు, విజయ్ ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తాడని ప్రచారం జరిగింది. కానీ మేనిఫెస్టో తర్వాత, కొంతమంది మద్దతుదారులు వెనకడుగు వేశారు. సబ్సిడీలు, ఉచితాలపై అతని వైఖరి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కానీ ఓటింగ్ తర్వాత, క్షేత్రస్థాయి స్పందన ఆశ్చర్యపరిచింది. అతనికి ఓటు వేస్తున్నది కేవలం యువత మాత్రమే కాదు. అన్ని వర్గాల ప్రజలు అతనికి మద్దతు ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది కనిపించింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు, అతని సినీ వ్యక్తిత్వం ప్రభావంతో విజయ్తో బలమైన అనుబంధాన్ని చూపించారు. కాబట్టి టీవీకే ప్రభావం పట్టణ ప్రాంతాలకే పరిమితం అనే ఆలోచన సరైనది కాదు. ఒకవేళ ఆ అంచనా తప్పయితే, పట్టణ ప్రాంతాల్లో డీఎంకే ఆధిపత్యం చెలాయిస్తుండగా, టీవీకే కారణంగా ఏఐఏడీఎంకే నష్టపోతోందనే వాదన కూడా సందేహాస్పదంగా ఉంది.
అనేక సర్వేలు ఏఐఏడీఎంకే ఓట్ల వాటా పెరుగుతుందని వెల్లడిస్తున్నాయి. దీనికి కారణమవుతున్న అంశాలు ఏమిటి?
ఈసారి ఏఐఏడీఎంకే బలమైన, ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ప్రకటించింది. వారు దానిని ముందుగానే, ఆత్మవిశ్వాసంతో విడుదల చేశారు. ఇది ప్రజాకర్షక పథకాలను విధానపరమైన వాగ్దానాలతో మిళితం చేసింది.
ఉదాహరణకు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం అనే ప్రకటన క్షేత్రస్థాయిలో బలమైన సంచలనాన్ని సృష్టించింది. ప్రచారాల సమయంలో చాలా మంది పురుషులు దీని గురించి సానుకూలంగా మాట్లాడారు. ప్రజా రవాణా వల్ల మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నప్పటికీ, ఈ ప్రకటన పురుష ఓటర్లలో భావోద్వేగాన్ని రేకెత్తించింది.
అలాగే, ఏఐఏడీఎంకే తన పొత్తులను వేగంగా, సమర్థవంతంగా పటిష్టం చేసుకోగలిగింది. చారిత్రాత్మకంగా డీఎంకే బలమైన పొత్తుల నిర్మాణాన్ని కొనసాగించినప్పటికీ, తన మద్దతుదారులను సమీకరించి, వాగ్దానాలను ప్రజలకు చేరవేయగల ఏఐఏడీఎంకే సామర్థ్యం ఓట్ల వాటా అంచనాలో దానికి ఒక ఆధిక్యతను ఇచ్చింది.
మేనిఫెస్టో వాగ్దానాలు నిజంగా ఓటర్ల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయా?
కచ్చితంగా చేస్తాయని ఇది వరకూ నిరూపితం అయింది. మేనిఫెస్టోలు మార్గదర్శక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని డీఎంకే గతంలో చేసిన ప్రకటన చివరికి విధానపరమైన చర్యలుగా రూపాంతరం చెందింది.
మేనిఫెస్టోలు దిశానిర్దేశం చేస్తాయి, అంచనాలను నిర్దేశిస్తాయి. అవి పూర్తిగా అమలు కాకపోయినా, ఓటర్ల అవగాహనను, నమ్మకాన్ని తీర్చిదిద్దుతాయి. ఈసారి, ఏఐఏడీఎంకే మేనిఫెస్టో క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రభావాన్ని చూపింది.
మీరు పలువురు రాజకీయ నాయకులతో పనిచేశారు. ప్రచార శైలులలో, ముఖ్యంగా యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడంలో మార్పులను గమనించారా?
అవును పనిచేశాను. కానీ ఇది పూర్తిగా కొత్తేమీ కాదు. రాజకీయ నాయకులు ఎప్పుడూ కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకుంటారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వ్యాప్తి కారణంగా ప్రచార స్థాయి, ప్రాచుర్యం పూర్తిగా మారాయి. నేటి నాయకులు తమను తాము ఎలా ప్రదర్శించుకుంటున్నారు అంటే వారు ఉపయోగించే భాష, వారు ఎంచుకునే వేదికల విషయంలో మరింత స్పృహతో ఉన్నారు.
"జెన్ జెడ్ విధానం" అనుసరిస్తూ... ఓటర్లు ఎక్కడున్నారో అక్కడే వారిని కలవడం. నా అనుభవం ప్రకారం, నాయకులలో ఒక సాధారణ లక్షణం క్రమశిక్షణ, వినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత తీరికలేని షెడ్యూల్ ఉన్నప్పటికీ, వారు అత్యంత నిబద్ధతతో ఉంటారు.
రాజకీయ నాయకులకు క్రమశిక్షణ లోపిస్తుందనే ఆలోచన పూర్తిగా తప్పు. వ్యూహకర్తలుగా, మేము వారికి ట్రెండ్లకు అనుగుణంగా మారడంలో సాయం చేస్తాము. ఎలా సంభాషించాలి, తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలి. ఎందుకంటే సందేశం ఎంత ముఖ్యమో, ప్రజలను చేరుకోవడం కూడా అంతే ముఖ్యం.
పొత్తుల గతిశీలత ఎన్నికల వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేసింది?
పొత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. బీజేపీ తమిళనాడులో తన కేడర్ను చురుకుగా ఏర్పాటు చేసుకుంటోంది. తన బలాన్ని పరీక్షించుకోవడానికి 2024లో స్వతంత్రంగా కూడా పోటీ చేసింది.
మరోవైపు, కాంగ్రెస్ ప్రధానంగా డీఎంకే సంస్థాగత బలంపై ఆధారపడి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో అది తన క్షేత్రస్థాయి ఉనికిని స్వతంత్రంగా పరీక్షించుకోలేదు. బీజేపీ తమిళ వ్యతిరేక పార్టీ అనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ప్రజలు వాస్తవాలు, కథనాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో కాలక్రమేణా అది తగ్గింది.
బీజేపీ తన ప్రచారాల సమయంలో "డబుల్ ఇంజిన్ ప్రభుత్వం" అనే నినాదాన్ని కూడా ఉపయోగించుకుంది. మొత్తమ్మీద, బీజేపీ తన పునాదిని నిర్మించుకోవడంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తుండగా, కాంగ్రెస్ తన మిత్రపక్షంపై ఆధారపడుతోంది.
ఎగ్జిట్ పోల్స్, సర్వేలు తరచుగా ఎందుకు తప్పుగా ఉంటాయి?
నేటి ఓటర్లు గతంలో కంటే చాలా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. సోషల్ మీడియా సమాచారాన్ని స్వీకరించే అర్థం చేసుకునే విధానాన్ని మార్చేసింది. సర్వేయర్లు ఓటర్లను సంప్రదించినప్పుడు, చాలామంది నిజాయితీగా సమాధానాలు ఇవ్వరు. కొందరు వ్యంగ్యంగా స్పందిస్తారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తారు.
మరికొందరు తమ ఎంపికను వెల్లడించడానికి నిరాకరిస్తారు. వారి స్పందనలను మీడియా కథనాలను రూపొందించడానికి ఉపయోగించుకోవచ్చనే భావన కూడా ఉంది. కథనాలు ఎలా నిర్మించబడతాయో ఇప్పుడు ప్రజలకు తెలుసు. గతంలో, రాజకీయ పార్టీలు సాంప్రదాయ మీడియా ఛానెళ్లపై ఆధారపడేవి. నేడు, విజయ్, సీమాన్ వంటి నాయకులు సోషల్ మీడియా ద్వారా దానిని అధిగమించి, సహజసిద్ధమైన విశ్వసనీయతను పెంచుకున్నారు.
ఈ మార్పు సర్వేలకు వాస్తవ మనోభావాన్ని పట్టుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అందుకే 2024 ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం చాలా తేడాలను చూశాము.
Next Story

