
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది?
నిరసనకారులపై పాక్ సైన్యం దుశ్చర్యలు, ప్రపంచ వ్యాప్త ఖండనలు
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న స్థానికులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా తీవ్రంగా నిరసనలు చెలరేగాయి. జూన్ 7 రాత్రి రావల్కోట్ లోని ఈ సంఘటన జరిగింది. కాల్పుల్లో కనీసం 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.
ఈ అణచివేత చర్య ప్రాంతవ్యాప్త బంద్కు దారితీసింది, అంతర్జాతీయ సమాజం కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఐరాస వెంటనే జోక్యం చేసుకోవాలని మన దేశ రాజకీయా పార్టీలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు రావల్కోట్ వీధుల్లోకి పోటెత్తారు. పాకిస్తాన్ సైనిక నియంతృత్వంగా వారు అభివర్ణిస్తున్న దానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 11 కాగా, గాయపడిన వారి సంఖ్య 70కి పైగా ఉంది.
అయితే, స్థానిక వర్గాలు, పలు మీడియా నివేదికల ప్రకారం 27 మంది వరకు మరణించి ఉండవచ్చని, దాదాపు 200 మంది గాయపడి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాంతమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ఇలాంటి విషయాలు బయటకు రావడం లేదు. నిరసన వార్తలపై సెన్సార్ షిప్ విధిస్తున్నారని కూడా సమాచారం.
జేఏఏసీ పై నిషేధం..
ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై పాక్ సర్కార్ విధించిన నిషేధం. ఇది ఒక పౌర సమాజ కూటమి, గత రెండేళ్లుగా రాయితీ పిండి, విద్యుత్, నిరుద్యోగం, అధిక రాజకీయ ప్రాతినిధ్యం కోసం క్షేత్రస్థాయి నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.
జూన్ 5న పాకిస్తాన్ జూలై 27న ప్రాంతీయ ఎన్నికలను ప్రకటించిన రోజే అధికారులు పీఓజేకే అంతటా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసి, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద JAACను నిషేధిత సంస్థగా ప్రకటించారు.
జూన్ 9న, JAAC ఈ ప్రాంతమంతటా పూర్తి బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు పీఓజేకే అంతటా విస్తృత మద్దతు లభించింది. బ్యాంకులు, దుకాణాలు, రవాణా సేవలు మూసివేయబడ్డాయి. భింబర్ నుంచి ముజఫరాబాద్ వరకు దాదాపు మూడు వందల కిలోమీటర్లు నిరసనకారులు ప్లాన్ చేసిన పాదయాత్రను పోలీసులు నిలిపివేశారు. పాకిస్తాన్ - చైనాలను కలిపే వ్యూహాత్మక మార్గమైన కారకోరం హైవేను కూడా నిరసనకారులు దిగ్బంధించినట్లు సమాచారం.
పాకిస్తాన్ ప్రతిస్పందన..
ఇది అణచివేత చర్య అనే వాదనను పాకిస్తాన్ భద్రతా సంస్థ తిరస్కరించింది. ఈ ఘర్షణల్లో నలుగురు చట్ట అమలు సిబ్బంది మరణించారని, 20 మందికి పైగా భద్రతా అధికారులు గాయపడ్డారని పీఓజేకే ఇన్స్పెక్టర్ జనరల్ ధృవీకరించారు.
ఆధునిక ఆయుధాలు, పెట్రోల్ బాంబులను ఉపయోగించి జేఏఏసీ గెరిల్లా తరహా దాడికి పాల్పడిందని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణను ఆ సంస్థ ఖండించింది. జూన్ 11న, రావల్కోట్లో వేలాది మంది మరో ప్రదర్శన కోసం గుమిగూడారు. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని జేఏఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
భారత్ స్పందన..
ఈ అణచివేత చర్య మనదేశంలో తీవ్ర చర్యలకు దారితీసింది. శ్రీనగర్లో 'కాశ్మీర్లోని ఉగ్రవాద బాధితుల సంఘం' సభ్యులు అంతర్జాతీయ జవాబుదారీతనం కోరుతూ ఐక్యరాజ్యసమితి కార్యాలయం వెలుపల నిరసన చేపట్టారు. 'కాశ్మీర్లోని ఉగ్రవాద బాధితుల సంఘం' ఛైర్పర్సన్ తస్లీమా అఖ్తర్ మాట్లాడారు.
"పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజల కోసం, పాకిస్తాన్ సైన్యం అమాయక పౌరులపై ఎలా నిర్విరామంగా కాల్పులు జరుపుతోందో తెలియజేయడానికి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము... ఈ రోజు మేము వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము" అని అన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) జోక్యం చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ, "ఆ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక ఘోరం జరుగుతోంది... అక్కడ చాలా మంది అమరులయ్యారు. పూర్తి వివరాలు తెలియవు. ఆ ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో చూడటానికి UNHRC అక్కడికి వెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు.
ప్రపంచ ఒత్తిడి..
అంతర్జాతీయ సమాజం కూడా దీనిపై విమర్శలు గుప్పించింది. పాకిస్తాన్ అణచివేతను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా విమర్శించింది. JAAC పై నిషేధాన్ని చట్టవిరుద్ధమైనదిగా, అసమానమైనదిగా అభివర్ణిస్తూ, ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు అధికారులు మితిమీరిన బలప్రయోగం చేస్తున్నారని, అసమ్మతిని అణచివేస్తున్నారని, ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.
ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కారణంగా తమ బంధువులను సంప్రదించలేని బ్రిటిష్ కాశ్మీరీల ప్రేరణతో, 50 మందికి పైగా బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు ఈ పరిస్థితిపై యూకే అధికారులకు లేఖ రాశారు.
పీఓజే కి తదుపరి పరిస్థితి ఏమిటి?
పీఓజేకేలో క్షేత్రస్థాయిలో, నిరసనలు శాంతించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంటర్నెట్ బ్లాక్అవుట్లు అక్కడి పరిస్థితి బయటకు రాకుండా చేస్తున్నాయి. ఈ ప్రాంతమంతటా భద్రతా దళాలను భారీగా మోహరించడంతో, రావల్కోట్లో ఏమి జరుగుతుందో ప్రపంచం చూసే అవకాశం తీవ్రంగా పరిమితం చేసింది. అయితే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ వాణిని వినిపించాలని డిమాండ్ చేస్తున్నారనేది స్పష్టం.
Next Story

