
సారాంశ్ జైన్
శ్రీలంకతో సిరీస్ కు సారాంశ్ జైన్ కు పిలుపు
వాషింగ్టన్ సుందర్ కు గాయం కావడంతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ కు అవకాశం
వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత 15 మంది సభ్యుల జట్టును సెలెక్టర్లు ప్రకటించింది. ఇందులో మధ్య ప్రదేశ్ కు చెందిన కుడి చేతి ఆఫ్ స్పిన్నర్ అయిన సారాంశ్ జైన్ కు అవకాశం దక్కింది. కండరాల గాయం నుంచి కోలుకుంటున్న వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో, 33 ఏళ్ల సారాంశ్కు జట్టులో చోటు దక్కింది. ఈ చిన్న సిరీస్ గాలే (ఆగస్టు 15 నుంచి 19 వరకు), కొలంబో (ఆగస్టు 23 నుంచి 27 వరకు)లలో జరగనుంది.
ప్రధాన సిరీస్కు సన్నద్ధం కావడానికి భారత్ ఆగస్టు 7 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది. వాషింగ్టన్ గైర్హాజరీలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు కుడిచేతి ఫింగర్ స్పిన్నర్ అవసరం కావడంతో సారాంశ్కు జట్టులో చోటు దక్కింది.
చంద్రకాంత్ పండిట్ కోచింగ్ కింద మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన ఈ పొడగరి ఆఫ్-స్పిన్నర్, ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన ఇండియా 'ఎ' జట్టులో సత్తా చాటాడు. అక్కడ రెండు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు, ఒక ఇన్నింగ్స్ లో 70 పరుగులు సాధించాడు.
రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్నర్లుగా, కుల్దీప్ యాదవ్ ఎడమచేతి మణికట్టు స్పిన్నర్గా ఉండటంతో, సెలెక్టర్లు వైవిధ్యం కోసం పోటీలో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ కుడిచేతి ఫింగర్ స్పిన్నర్ను జట్టులోకి తీసుకున్నారు. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టుకు జడేజాకు విశ్రాంతినిచ్చారు.
2024-25 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలో రిటైర్ అయిన ఆర్. అశ్విన్ స్థానంలో వచ్చిన ముంబై ఆల్-రౌండర్ తనుష్ కోటియన్, నిలకడగా వికెట్లు తీసే ప్రదర్శనలు చేయలేకపోవడం వల్ల జట్టులో తన స్థానాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. మిగిలిన జట్టు ఎంపిక చాలావరకు ఊహించిన విధంగానే ఉంది.
శ్రీలంక 'ఎ' జట్టుపై జరిగిన మ్యాచ్లో అద్భుతంగా 10 వికెట్లు పడగొట్టిన కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేస్ బౌలింగ్ సారథి జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్లను ఫిట్నెస్కు లోబడి జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక పర్యటనకు జట్టు బయలుదేరే ముందు, ఈ నెల చివరలో వారు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వైద్య పరీక్షలకు హాజరవుతారు.
అధికారికంగా ఎవరినీ ప్రత్యామ్నాయంగా ప్రకటించనప్పటికీ, ఒకవేళ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోతే, విదర్భ పేసర్ యశ్ ఠాకూర్, జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అఖిబ్ నబీ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.
భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, గుర్నర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్
Next Story

