
‘AIలో భారత్కు ఇంకా అవకాశం ఉంది’
భారత్కి సొంతంగా ChatGPT తరహా పెద్ద AI మోడల్ లేకపోవడంపై ఆందోళన అవసరం లేదని జోహో సహవ్యవస్థాపకుడు కుమార్ వేంబు అన్నారు.
కృత్రిమ మేధస్సు (Artifical Intelligence) రంగంలో భారత్ పురోగతి సాధించగలదని జోహో (Zoho) సహ వ్యవస్థాపకుడు కుమార్ వేంబు (Kumar Vembu) అన్నారు. అయితే, అందుకోసం దేశం తన దృష్టిని సరైన దిశలో పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. చాట్జీపీటీకి పోటీగా ఒక పెద్ద AI మోడల్ను నిర్మించాలనే ఆలోచనలోనే ఇరుక్కుపోవడం సరైంది కాదని, అసలు అవసరం విద్యా నాణ్యతను మెరుగుపరచడం, AI వినియోగాన్ని విస్తరించడం, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించడమేనని స్పష్టం చేశారు.
దాదాపు రెండేళ్లుగా భారత్లో AIపై పెద్ద చర్చే జరుగుతోంది. అమెరికా OpenAI, Anthropic, Google వంటి సంస్థలతో ముందుకు దూసుకెళ్తుండగా, చైనా DeepSeek వంటి తక్కువ ఖర్చు మోడళ్లతో తన సామర్థ్యాన్ని చూపించింది. అయితే భారత్కు ఇప్పటికీ అలాంటి ప్రాథమిక AI మోడల్ లేకపోవడంతో, దేశం వెనుకబడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘ది ఫెడరల్’ యూట్యూబ్ కార్యక్రమం ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’లో మాట్లాడిన కుమార్ వేంబు.. “మనకు ఏ బస్సూ మిస్సవలేదు” అని స్పష్టం చేశారు. ఒక ఫౌండేషన్ మోడల్ మన దగ్గర లేదని బాధపడటానికి బదులు, మన పరిస్థితులకు తగిన ప్రాధాన్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి అందుబాటులో ఉన్న పరిమిత మూలధనాన్ని ఎక్కడ వినియోగించాలో ఆలోచించడం ముఖ్యం అని చెప్పారు.
అమెరికాలో దశాబ్దాలుగా ప్రభుత్వ నిధులతో జరిగిన శాస్త్రీయ పరిశోధనలు ఈరోజు AI పురోగతికి పునాది వేశాయని వేంబు గుర్తు చేశారు. అయితే, భారత్ పరిస్థితి పూర్తిగా భిన్నమని అన్నారు. భారీగా పెట్టుబడి పెట్టే సామర్థ్యం భారత్లాంటి దేశాలకు ఉండదని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, AIలో చాలా శాస్త్రం ఇప్పటికే నిరూపితమైందని, అందువల్ల ఇది క్రమంగా ‘శాస్త్ర సమస్య’ కంటే ‘ఇంజినీరింగ్ సమస్య’గా మారుతోందని విశ్లేషించారు. దీంతో ఇందులోకి రావడానికి అవసరమైన పెట్టుబడి కూడా కొంత తగ్గిందన్నారు.
భారత్ AI రంగంలో ఆలస్యంగా ప్రవేశించిందనే భావన ఉన్నప్పటికీ, దాంతో అవకాశాలు ముగిసిపోయినట్లేమీ కాదని వేంబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధిపై చేసే ఖర్చు ఇంకా చాలా తక్కువగా ఉందని, అది జీడీపీలో సుమారు 0.6 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. అలాగే, అత్యాధునిక GPUలు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల ప్రాప్యతలో భారత్ ఇంకా పరిమితులనే ఎదుర్కొంటోందన్నారు. దేశ భాషా వైవిధ్యం కూడా పెద్ద భాషా నమూనాల అభివృద్ధికి ఒక పెద్ద సవాలుగా మారుతోందని పేర్కొన్నారు.
అయితే, చైనా DeepSeek ఉదాహరణ ఆశాజనకమని వేంబు అన్నారు. తక్కువ ఖర్చుతో కూడా శక్తివంతమైన AI వ్యవస్థలు అభివృద్ధి చేయవచ్చని అది నిరూపించిందన్నారు. “ఇప్పటికే ఎవరో ఇది చేసి చూపిస్తే, అది పూర్తిగా కొత్త శాస్త్రం కాదని, ఇంజినీరింగ్తో కూడా సాధ్యమని అర్థం” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే భారత్ కూడా ముందుకు రావచ్చని చెప్పారు.
భారత్లో అసలు సమస్య డబ్బు కొరత కాదని, ప్రతిభ కొరత కూడా కాదని వేంబు స్పష్టం చేశారు. సమస్య విద్యా నాణ్యతలో ఉందన్నారు. “మానవ ప్రతిభను వృథా చేయడంలో మనం చాలా నైపుణ్యం సంపాదించాం” అని వ్యాఖ్యానించారు. అధునాతన సాంకేతిక రంగాల్లో భారత్ వెనుకబడటానికి ప్రధాన కారణం విద్యా వ్యవస్థేనని అభిప్రాయపడ్డారు. సామర్థ్యానికి బదులు అర్హతా పత్రాలకు, ప్రాక్టికల్ సమస్య పరిష్కారానికి బదులు సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
దశాబ్దాలుగా ఇంజినీర్లను నియమించుకున్న అనుభవంతో మాట్లాడుతున్నానని చెప్పిన వేంబు, చాలామంది ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లు చెప్పగలరేమో గానీ, తాము నిజంగా ఏం నిర్మించారో వివరించలేరని అన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉందని, శిక్షణ భారమంతా కంపెనీలపైనే పడుతోందని చెప్పారు. AIపై జరుగుతున్న చర్చ ఈ లోతైన నిర్మాణాత్మక బలహీనతల నుంచి దృష్టి మళ్లించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రాథమిక సాంకేతికతలపై పెట్టుబడి తక్కువే
గత 40 ఏళ్లుగా భారత్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ భాషలు, ప్రాసెసర్లు వంటి ప్రాథమిక సాంకేతికతలపై పెద్దగా పని చేయలేదని వేంబు గుర్తు చేశారు. ఇంతకాలం ఫౌండేషన్ లేయర్పై పని చేయకపోయి, ఇప్పుడు ఒక్కసారిగా AIలో మాత్రమే ఎందుకు పెద్ద మోడళ్లు లేదా GPUలు నిర్మించలేదని ప్రశ్నించడం సబబు కాదన్నారు. అయితే, దీని అర్థం భారత్కు అవకాశాలే లేవని కాదని స్పష్టం చేశారు.
అవకాశం ఎక్కడుంది?
భారతీయ టెక్ కంపెనీల బలం ప్రాథమిక పరిశోధనలో కాకుండా, అప్లికేషన్లు, సేవలు, వ్యాపార సాఫ్ట్వేర్లలో ఉందని వేంబు పేర్కొన్నారు. AI ఇప్పుడు వ్యాపారాల్లో, సేవల్లో, ఉత్పాదకతలో కీలక సాధనంగా మారుతోందని చెప్పారు. కస్టమర్ సపోర్ట్ను ఆటోమేట్ చేయడం, ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం, సేవలను విస్తరించడం వంటి రంగాల్లో ఇప్పటికే ఉన్న AI మోడళ్లను వినియోగించి భారత కంపెనీలు ముందుకు రావచ్చని అన్నారు.
అయితే, స్టార్టప్లకు తొలి కస్టమర్లు దొరకడం భారత్లో ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉందని వేంబు అన్నారు. పెద్ద కంపెనీలు “ముందు ఇంకెవరో వాడుతున్నారని చూపించండి, అప్పుడు మేము కొనుగోలు చేస్తాం” అని చెప్పడం వల్ల స్టార్టప్లకు అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. అందుకే స్టార్టప్ల నుంచి కొనుగోలు చేయడాన్ని దాదాపు కార్పొరేట్ సామాజిక బాధ్యతలా చూడాలని సూచించారు. విజయవంతమైన కంపెనీలు కొత్త టెక్ సంస్థలకు తొలి అవకాశాలు ఇవ్వాలని, వారి ఉత్పత్తులను పరీక్షించాలని, మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలని అన్నారు.
భారత్కు వేంబు సందేశం
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు AI మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్ సామర్థ్యంపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్న సమయంలో, భారత్ దగ్గర ఇంకా ఒక పెద్ద ఫౌండేషన్ మోడల్ లేకపోవడం కొందరిని కలవరపెడుతోంది. అయితే, దేశ భవిష్యత్తు కేవలం “మన ChatGPT ఎక్కడ?” అనే ప్రశ్నకు మాత్రమే పరిమితం కాదని వేంబు చెప్పారు. దానికి బదులుగా, “మన విద్యా వ్యవస్థను మెరుగుపరచగలమా? సమస్యలను పరిష్కరించే యువతను తయారు చేయగలమా? స్టార్టప్లకు అవకాశం ఇచ్చే వాతావరణం కల్పించగలమా? వ్యాపారాల్లో AI వినియోగాన్ని వేగంగా విస్తరించగలమా?” అన్నవే అసలు ప్రశ్నలని ఆయన అభిప్రాయపడ్డారు.
“మనం విద్యపై దృష్టి పెట్టి, ఆవిష్కరణలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే, ఖచ్చితంగా పురోగతి సాధిస్తాం” అని కుమార్ వేంబు తేల్చిచెప్పారు.

